Maruti Suzuki | న్యూఢిల్లీ, జూలై 5: మారుతి సుజుకీ తాజాగా ప్రీమియం సెగ్మెంట్లోకి ప్రవేశించింది. రూ.20 లక్షల కంటే అధిక ధర కలిగిన ప్రీమియం మల్టీ పర్పస్ వాహనమైన ఇన్విక్టోను పరిచయం చేసింది. రూ.24.80 లక్షల నుంచి రూ.28.42 లక్షల శ్రేణిలో లభించనున్న ఈ మల్టీ పర్పస్ వాహనం సంస్థ విడుదల చేసిన అత్యంత ఖరీదైనది ఇదే కావడం విశేషం.
ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో హిసాచీ తకేచి మాట్లాడుతూ..ఎస్యూవీ సెగ్మెంట్ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు, ఇప్పటికే గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, జిమ్నీలకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నదన్నారు. కంపెనీ మొత్తం విక్రయాల్లో ఎస్యూవీ వాటా 8.5 శాతంగా ఉండగా..ప్రస్తుతం ఇది 20 శాతానికి పైకి చేరుకున్నట్టు చెప్పారు. 2030 నాటికి సుజుకీ టర్నోవర్ రూ.4.32 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 2021-22లో నమోదైన రూ.2.16 లక్షల కంటే ఇది రెట్టింపుస్థాయి.