Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki).. దేశీయంగా కార్ల విక్రయాల్లో అగ్ర తాంబూలం.. సంప్రదాయ మోడల్ కార్లలో హ్యుండాయ్, కియా మోటార్స్.. ఈవీ కార్లలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా పోటీ పడుతున్నా.. మార్కెట్లో ప్రధాన వాటా మారుతిదే. కస్టమర్లకు మరింత చేరువ కావడానికి ఆరేండ్ల క్రితం ‘ఎరీనా’ రిటైల్ నెట్వర్క్ ప్రారంభించిన మారుతి సుజుకి.. గణనీయ విజయాలు సాధించింది. 2017 నుంచి ఇప్పటి వరకు 70.5 లక్షల కార్లను విక్రయించింది.
వాటిల్లో బ్రెజా, వాగన్-ఆర్, స్విఫ్ట్, ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, డిజైర్, ఎర్టిగా, ఎకో వంటి మోడల్ కార్లదే ప్రధాన వాటా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జూలై నెలాఖరు వరకు మొత్తం కార్ల విక్రయాల్లో ఈ మోడల్ కార్లే 68 శాతం వాటా కలిగి ఉన్నాయి. మొత్తం కార్ల సేల్స్లో 29 శాతం మారుతి కార్లే ఉంటాయి. కార్ల విక్రయాలను డిజిటలైజ్ చేయడానికి ప్రారంభించిన ‘ఎరీనా’ నెట్ వర్క్.. కుర్రకారు, టెక్ ప్రొఫెషనల్స్కు మారుతి సుజుకి దగ్గర కావడంలో కీలకంగా మారింది.
దేశవ్యాప్తంగా 2392 నగరాల పరిధిలో 2853 ఔట్ లెట్లతో కూడిన మారుతి ‘ఎరీనా’ నెట్ వర్క్ పని చేస్తున్నది. అంతేకాదు.. 20 లక్షల మందికి పైగా కస్టమర్ల మనస్సులు చూరగొన్నది మారుతి.