న్యూఢిల్లీ, జనవరి 14: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనాన్ని పొందడం కోసం సిండికేట్ను నడుపుతూ ఏకంగా రూ.4,521 కోట్ల నకిలీ ఇన్వాయిస్లను జారీ చేసిన ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. ఈ సిండికేట్ ఆధ్వర్యంలో 636 నకిలీ సంస్థలున్నాయని గుర్తించినట్టు శుక్రవారం విడుదలైన ఓ అధికారిక ప్రకటన స్పష్టం చేసింది. సదరు కంపెనీల డాటాను పరిశీలించడంతో ఈ కుంభకోణం వెలుగుచూసినట్టు జీఎస్టీ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ నెల 13న అసలు సూత్రధారిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 6న ఢిల్లీలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) ముమ్మర సోదాలు నిర్వహించిందని, ఈ సందర్భంగానే ఆధారాలను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. వీటిలో డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్స్, చెక్ బుక్కులు, స్టాంపులు, సిమ్ కార్డులున్నాయి. ఎటువంటి వస్తూత్పత్తులను సరఫరా చేయకుండానే ఈ సంస్థల్లో ఇన్వాయిస్లను ఇష్యూ చేశామని స్కాం సూత్రధారి అంగీకరించినట్టు తెలిపారు. జారీ చేసిన ఇన్వాయిస్ల విలువ దాదాపు రూ.4,521 కోట్లు అని, ఐటీసీ సుమారు రూ.741 కోట్లుగా ఉందన్నారు. కాగా, నకిలీ సంస్థ ఖాతాలను ఇప్పటికే ఫ్రీజ్ చేశామని అధికారులు చెప్పారు.