Bank Liquidity | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశీయ బ్యాంకులు నగదు లోటును ఎదుర్కొన్నాయి. ఈ నెల 20న నాలుగేండ్లకుపైగా గరిష్ఠాన్ని తాకుతూ రూ.1.46 లక్షల కోట్లను తాకింది. 2019 ఏప్రిల్ 23 తర్వాత ఈ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారి. కాగా, అడ్వాన్స్ ట్యాక్స్ , వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపులు.. బ్యాంకుల్లో ఒక్కసారిగా నగదు కొరతకు దారితీశాయి. ఈ క్రమంలోనే బ్యాంకులు మార్జినల్ స్టాండింగ్ సదుపాయం (ఎంఎస్ఎఫ్) ద్వారా రికార్డు స్థాయిలో రూ.1.97 లక్షల కోట్లను రుణంగా తీసుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలియజేసింది. ఇక ఇందులో దాదాపు రూ.46,724 కోట్లను స్పెషల్ డిపాజిట్ సదుపాయం కింద ఉంచిన బ్యాంకులు.. మిగతా మొత్తాన్ని కస్టమర్ల అత్యవసరాలకు వినియోగించాయి. బుధవారం మొత్తంగా రూ.2.5 లక్షల కోట్లకు డిమాండ్ వచ్చినట్టు అంచనా. ఇందులో లక్ష కోట్లను బ్యాంకులు సొంతంగా సమకూర్చుకున్నా.. ఆర్బీఐ నుంచి రూ.1.5 లక్షల కోట్లు తీసుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఆగస్టులో తొలిసారి బ్యాంకులు నగదు లోటును చూశాయి.
ఐసీఆర్ఆర్ ప్రభావం
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఒడిదుడుకులతో వచ్చే ఇబ్బందులను, విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం ముప్పును తప్పించుకోవడానికి బ్యాంకులకు ఆర్బీఐ విధించిన ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐసీఆర్ఆర్) సైతం నగదు లోటుకు దారితీసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు. ఈ ఏడాది ఆగస్టు ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ ఐసీసీఆర్ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బ్యాంకులు తమ ఇంక్రిమెంటల్ డిపాజిట్లలో 10 శాతాన్ని పక్కనబెట్టాలని ఆదేశించింది. ఫలితంగా బ్యాంకుల వద్ద మిగులు నగదు నిల్వలు తగ్గిపోయాయి. కాగా, ఇంచుమించుగా వచ్చే నెల మొదటి వారం వరకు బ్యాంకులు ఇదే రకమైన ఒత్తిడిని ఎదుర్కోవచ్చన్న అంచనాను కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త ఉపాసన భరద్వాజ్ వెలిబుచ్చారు.
బ్యాంకింగ్ రంగంలో నగదు లోటు.. బ్యాంకుల వద్ద ఎంత నగదు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఖాతాదారుల చేతికి ఎంత త్వరగా కరెన్సీ అందుతున్నది అన్నదాన్ని సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే కస్టమర్ల అవసరాల కోసం నగదును ఆర్బీఐ ద్వారా బ్యాంకులు సమకూర్చుకుంటే నగదు లోటుగానే పరిగణించవచ్చు. అలాగే రోజువారీ వ్యాపారం, ఆర్థిక అవసరాలకు బ్యాంకుల వద్దే తగినన్ని నగదు నిల్వలుంటే, వాటిని ఆర్బీఐకి అందిస్తే దాన్ని నగదు మిగులుగా భావించవచ్చు.
నగదు లోటు అంటే?
ఇక రోజువారీ అవసరాల నిమిత్తం ఆర్బీఐ దగ్గర బ్యాంకులు తీసుకునే రుణాలను నగదు సర్దుబాటు సదుపాయం (ఎల్ఏఎఫ్)గా చెప్తారు. ఎల్ఏఎఫ్ను బ్యాంకు ఉపయోగించుకున్నదంటే అది నగదు లోటును ఎదుర్కొంటున్నదనే అర్థం. అలాగే ఏ రోజైనాసరే ఆర్బీఐకి బ్యాంకు నుంచి నగదు నిల్వలు చేరాయంటే ఆ బ్యాంకు నగదు మిగులులో ఉన్నట్టు. ఇక బ్యాంకులకు ఆర్బీఐ రుణాలిస్తే దానికి రెపో రేటు వర్తిస్తుంది. ఆర్బీఐ వద్దే బ్యాంకులు తమ నగదును నిల్వచేస్తే దానికి రివర్స్ రెపో రేటు అమలవుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్వల్పకాలిక అవసరాల కోసం బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ రెపో రేటు వసూలు చేస్తుంది.
అలాగే బ్యాంకులు తమ వద్ద ఎక్కువైపోయిన నగదు నిల్వలను ఆర్బీఐ దగ్గర దాచిపెడతాయి. దీనికిగాను బ్యాంకులకు ఆర్బీఐ రివర్స్ రెపో రేటు ప్రకారం చెల్లిస్తుంది. రివర్స్ రెపో రేటు కంటే రెపో రేటు ఎక్కువగా ఉంటుంది.కాగా, ఎల్ఏఎఫ్ అనేది నిత్యం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియే. అయితే మార్జినల్ స్టాండింగ్ సదుపాయం (ఎంఎస్ఎఫ్) వినియోగం అనేది అసాధారణ పరిస్థితుల్లోనే జరుగుతుంది. బ్యాంకులు అత్యవసరంగా చెల్లించాల్సి వస్తే ఆర్బీఐ ద్వారా ఎంఎస్ఎఫ్ను వాడుకుంటాయి. ఎల్ఏఎఫ్ కన్నా ఎంఎస్ఎఫ్పై వడ్డీరేట్లు అధికంగా ఉంటాయి.