Lectrix EV | న్యూఢిల్లీ, జూలై 26: ఎస్ఏఆర్ గ్రూప్ అనుబంధ సంస్థ లెక్ట్రిక్స్ ఈవీ.. బుధవారం దేశీయ మార్కెట్లోకి సరికొత్త విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహనాలను తీసుకొచ్చింది. ఎల్ఎక్స్ఎస్ జీ3.0, ఎల్ఎక్స్ఎస్ జీ2.0 పేరుతో ఈ-స్కూటర్లను పరిచయం చేసింది. వీటి ప్రారంభ ధర రూ.1.03 లక్షలు. 2.3 కిలోవాట్స్, 3 కిలోవాట్స్ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చిన ఈ స్కూటర్లు.. చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్లకుపైగా వెళ్లగలవని కంపెనీ ఎండీ, సీఈవో కే విజయ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. దేశవ్యాప్తంగా తమకు 100కుపైగా డీలర్షిప్లున్నాయని, వచ్చే నెల 16 నుంచి స్కూటర్ల డెలివరీలు మొదలవుతాయని చెప్పా రు.
ఇక ఎమర్జన్సీ ఎస్వోఎస్ అలర్ట్, నావిగేషన్ అసిస్ట్, ఓవర్-ది-ఎయిర్ అప్డేట్స్ తదితర 12 అగ్రశ్రేణి ఫీచర్లతోపాటు మొత్తం ఈ స్కూటర్లలో 93 ఫీచర్లున్నాయని వివరించారు. ఈ ఏడాది దాదాపు 50వేల యూనిట్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ కంపెనీకి ఏటా 1.5 లక్షల యూనిట్లను తయారుచేసే ప్లాంట్ హర్యానాలోని మనేసర్లో ఉన్నది. 2020 నుంచి ఇప్పటిదాకా వ్యాపారంలో రూ.300 కోట్ల పెట్టుబడులనూ పెట్టింది. వ్యాపార విస్తరణ కోసం మరో రూ.500 కోట్లు అవసరమంటున్నది. వచ్చే ఏడాది నిధులను సమీకరించనున్నారు.