హైదరాబాద్, ఆగస్టు 29: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలితా జ్యూవెల్లరీ విస్తరణ బాట పట్టింది. ఇటీవల ఐపీవోకి వచ్చిన సంస్థ..తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో 60కి పైగా షోరూమ్లను నిర్వహిస్తుండగా, భవిష్యత్తులో మరో 110కి పైగా నూతన షోరూమ్లను ఏర్పాటు చేయబోతున్నట్టు కంపెనీ చైర్మన్, ఎండీ ఎం కిరణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో షోరూమ్లను నిర్వహిస్తుండగా, భవిష్యత్తులో ఉత్తర భారతంలో కూడా ప్రవేశించడానికి కసరత్తు చేస్తున్నట్టు ప్రకటించారు.
దీంతోపాటు అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా మలేషియా, సింగపూర్లలో కూడా స్టోర్లను ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. దీంతో మొత్తం షోరూమ్లు 175కి చేరుకోనున్నది. బంగారం ధరలు పెరుగుతూవుంటాయి.. తప్పా తగ్గవని, సమీప భవిష్యత్తులో మరో మైలురాయికి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. దీర్ఘకాలికంగా ధరలు పెరుగుతాయి తప్పా..తగ్గడం ఉండదని దీనిపై పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.