‘మా ఉద్యోగుల నిబద్ధత, మా క్లయింట్ల నమ్మకంతో దశాబ్దంలో ఎన్నడూ లేనంత వేగవంతమైన వృద్ధిని ఈ క్యూ1లో సాధించాం. ఈ ఆత్మవిశ్వాసంతో గైడెన్స్ను పెంచుతున్నాం’
–సలీల్ ఫరేఖ్ ,ఇన్ఫోసిస్ సీఈవో
న్యూఢిల్లీ, జూలై 14: ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు అదరగొట్టాయి. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దశాబ్ద కాలంలోనే ఎన్నడూ లేనంత వేగంగా వృద్ధిని సాధించిందీ దేశీయ ఐటీ రంగ సంస్థ. సంస్థ నికర లాభం 22.7 శాతం ఎగిసి రూ.5,195 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ.4,233 కోట్లుగా ఉన్నది. ఇక ఆదాయం 17.8 శాతం వృద్ధితో రూ. 23,665 కోట్ల నుంచి రూ. 27,896 కోట్లకు ఎగబాకినట్లు బుధవారం ఇన్ఫోసిస్ ప్రకటించింది. భవిష్యత్ వృద్ధిపట్ల మరింత ఆశాభావంతో ఉన్న ఇన్ఫోసిస్ యాజమాన్యం.. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు గైడెన్స్ను పెంచడం విశేషం. 12-14 శాతాన్ని సవరిస్తూ 14-16 శాతానికి తీసుకెళ్లింది.
కార్పొరేట్ల డిజిటలైజేషన్ నేపథ్యంలో డిజిటల్ టాలెంట్కు డిమాండ్ పెరుగుతున్నందున ఇన్ఫోసిస్ భారీ రిక్రూట్మెంట్ ప్రణాళికల్ని వెల్లడించింది. డిజిటల్ డిమాండ్ను అందుకునేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 35,000 కాలేజ్ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకుంటామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్రావు తెలిపారు. ఉద్యోగుల వలసలు కూడా పరిశ్రమకు సవాలుగా మారాయని, దాంతో కొత్త రిక్రూట్మెంట్స్ పెంచుతున్నామన్నారు. కాగా, 2021 జూన్లో ఇన్ఫోసిస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.67 లక్షలకు పెరిగింది.