Kia Cars | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా వచ్చేనెల నుంచి కార్ల ధరలు పెరుగుతున్నట్లు ప్రకటించింది. అన్ని కార్ల ధరలు మూడు శాతం పెరుగుతాయని పేర్కొంది. కమొడిటీ ధరలు పెరగడంతోపాటు సప్లయ్ చైన్ సంబంధ ఇన్ఫుట్ ఖర్చులు ఎక్కువ కావడంతో కార్ల ధరలు పెంచక తప్పడం లేదని కియా ఇండియా తెలిపింది. సెల్టోస్, సోనెట్, కరెన్స్ వంటి మోడల్ కార్ల ధరలు పెరుగుతాయని గురువారం వెల్లడించింది. ఈ ఏడాదిలో తాము కార్ల ధరలు పెంచడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. ఉదాహరణకు కియా సెల్టోస్ ధర రూ.10.90 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమైతే.. ఇప్పుడు దాని ధర రూ.11.20 లక్షలు పలుకుతుంది.
కస్టమర్లకు సాంకేతికంగా అత్యాధునిక ఫీచర్లు గల ప్రీమియం కార్లను అందించడానికి నిరంతరం తాము కృషి చేస్తున్నట్లు కియా ఇండియా నేషనల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ చెప్పారు. నిరంతరం కమొడిటీ ధరలు పెరగడం, ఎక్స్చేంజ్ రేట్లో ప్రతికూలతలు, ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో పాక్షికంగా కార్ల ధరలు పెంచక తప్పడం లేదని తెలిపారు.
ఖర్చులు, కమొడిటీ ధరలను సాధ్యమైనంత వరకూ తగ్గించడానికి ప్రయత్నించామని, తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పడం లేదని హర్దీప్ సింగ్ బ్రార్ పేర్కొన్నారు. భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11.6 లక్షల కార్లను కియా ఇండియా విక్రయించింది. ఇంతకు ముందు జనవరిలో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కార్ల తయారీ సంస్థలు కూడా ధరలు పెంచేశాయి.