న్యూఢిల్లీ, ఆగస్టు 17: కేరళకు చెందిన నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సేవలు సంస్థ(ఎన్బీఎఫ్సీ) ముత్తూట్ ఫైనాన్స్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. వచ్చే రెండు నుంచి మూడు నెలలకాలంలో దేశవ్యాప్తంగా కొత్తగా 114 శాఖలను ప్రారంభించాలనుకుంటున్నట్లు కంపెనీ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సంస్థ 59 శాఖలను ప్రారంభించడంతో మొత్తం శాఖల సంఖ్య 4,742కి చేరుకున్నాయి.
బంగారం తాకట్టుపై రుణాల్లో ఈ ఏడాది వృద్ధి 10 శాతం నుంచి 15 శాతం మధ్యలో నమోదుకావచ్చునని చెప్పారు. దేశవ్యాప్తంగా బంగారం రుణాలు తీసుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నారని, కమర్షియల్ బ్యాంక్లు కూడా ఈ విభాగంలోకి అడుగుపెట్టినప్పటికీ డిమాండ్ మాత్రం అధికంగా ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.