హైదరాబాద్, జూన్ 25: ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడ్ సెంటర్కు హైదరాబాద్ నిలయం కానుంది. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) ఏర్పాటు చేసేందుకు హైదరాబాదీ సంస్థ కపిల్ గ్రూప్ లైసెన్స్ పొందింది. ‘డబ్ల్యూటీసీ శంషాబాద్ ’ పేరుతో 50-60 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని నెలకొల్పుతారు. చైనా రాజధానిలోని బీజింగ్లో 43 ఎకరాల్లో ఏర్పాటైన డబ్ల్యూటీసీని మించి భారత్లో నెలకొన్న నోయిడా డబ్ల్యూటీసీ 44 ఎకరాల్లో విస్తరించి ఇప్పటివరకూ ప్రపంచంలో పెద్ద ట్రేడ్ సెంటర్గా గుర్తింపు పొందింది.
ఇప్పుడు దానికంటే మిన్నగా డబ్ల్యూటీసీ శంషాబాద్ నిర్మాణమవుతుంది. పలు ఎత్తయిన డబ్ల్యూటీసీల్లా కాకుండా, విమానాశ్రయం సమీపంలో ఉన్నందున..డబ్ల్యూటీసీ శంషాబాద్ను అధిక వైశాల్యంలో బహుళ టవర్స్తో నిర్మిస్తారు. ఒక్కో టవర్లో 12 అంతస్తులుంటాయి. మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామం వద్ద నెలకొన్న హార్డ్వేర్ పార్క్ వద్ద ఇది ఏర్పాటు కానుంది. ఈ ప్రదేశం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు కొద్ది వందల మీటర్లలో దూరంలోనే ఉంది.
2025లో ఫేజ్-1 ప్రారంభం
ప్రతిపాదిత డబ్ల్యూటీసీ శంషాబాద్ ఫేజ్-1ను 2025లో అధికారికంగా ప్రారంభించాలన్నది ప్రణాళిక. ఈ తొలి దశను 4 మిలియన్ చదరపు అడుగుల బిల్టప్ ఏరియా (ఎంఎస్ఎఫ్టీ) లో రూ. 4,000 కోట్ల పెట్టుబడితో పూర్తిచేయాలన్నది లక్ష్యం. 2035 సంవత్సరానికల్లా దీనిని 8-10 ఎంఎస్ఎఫ్టీకి విస్తరించాలన్నది తమ ప్రణాళిక అని డబ్ల్యూటీసీ శంషాబాద్ అండ్ విశాఖపట్నం వైస్ చైర్మన్, కపిల్ కన్సల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ వై వరప్రసాద్ రెడ్డి చెప్పారు.
తొలిదశలో తాము మొదటగా రూ.1,000 కోట్ల పెట్టుబడితో 1 ఎంఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ను, అందుకు అవసరమైన 225 గదుల హోటల్ కమ్ సర్వీస్డ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని, అటుతర్వాత రూ.500-1,000 కోట్ల చొప్పున పెట్టుబడితో ఒక్కో 1 ఎంఎస్ఎఫ్టీని అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ (డబ్ల్యూటీసీఏ) నుంచి గత ఏడాది శంషాబాద్, విశాఖపట్నం డబ్ల్యూటీసీల లైసెన్స్లను కపిల్ గ్రూప్ పొందిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటికే 15 ఎకరాల భూమిని పొంది, తవ్వకపు పనులు మొదలుపెట్టామని, ఈ ప్రాజెక్ట్ కోసం మరో 40-45 ఎకరాల్ని ప్రభుత్వం నుంచి తాము కోరుతున్నామని డబ్ల్యూటీసీ శంషాబాద్ అండ్ విశాఖపట్నం డైరెక్టర్ అఖిలేష్ మహుర్కర్ తెలిపారు.
సోలార్ ఎనర్జీతో విద్యుత్ అవసరాలు
డబ్ల్యూటీసీ విశాఖపట్నంను రిషికొండ హిల్స్ వద్ద 2 ఎంఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాతో 100 మీటర్ల ఎత్తయిన టవర్ను నిర్మించాలన్నది లక్ష్యమని, తదుపరి అదనపు టవర్స్తో దీనిని 4 ఎంఎస్ఎఫ్టీకి పెంచాలని భావిస్తున్నట్టు వరప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఈ రెండు ప్రాజెక్ట్లను కపిల్ గ్రూప్ కంపెనీ బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ నిర్మిస్తుంది. వీటి విద్యుత్ అవసరాల్ని పూర్తిగా సోలార్ ఎనర్జీతోనే తీరుస్తారు. డబ్ల్యూటీసీఏ నిబంధనల ప్రకారం రెండు ప్రాజెక్ట్ల్లోనూ 70-75 శాతం ఆఫీస్ ఇన్ఫ్రా కోసం, 25-30 శాతం హోటళ్లు, కో-లివింగ్ స్పేస్లు, కాన్ఫెరెన్సింగ్ సదుపాయాలు, ఎంటర్టైన్మెంట్ తదితర సోషల్ ఇన్ఫ్రాను నెలకొల్పుతారు.