Jock Dorsey | మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలగడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2008లో ట్విట్టర్ సీఈవోగా తొలిసారి వైదొలిగారు. కానీ 2015లో తిరిగి చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ట్విట్టర్తోపాటు టెక్నాలజీ పేమెంట్స్ అండ్ సర్వీసెస్ అనే సొంత సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. ఇదే ట్విట్టర్ సీఈవోగా రెండోసారి వైదొలగడానికి కారణమని తెలుస్తున్నది.
ట్విట్టర్ సీఈవోగా వైదొలగాలని నిర్ణయించుకున్నా.. సంస్థ తన ఫౌండర్లకు దూరమయ్యేందుకు సిద్ధమైందని భావిస్తున్నా.. పేమెంట్స్ కంపెనీ స్క్వేర్ ఇంక్ సీఈవో జాక్ డోర్సీ.. ఇటీవల క్రిప్టో కరెన్సీ లావాదేవీల పట్ల ఆసక్తి చూపుతున్నారు.
అంతే కాదు.. తన వారసుడిగా భారతీయుడు పరాగ్ అగర్వాల్ సరైన వ్యక్తి అని జాక్ డోర్సీ ప్రతిపాదించారు. ట్విట్టర్ పరివర్తనలో గత పదేండ్లుగా కృషి చేస్తున్నారు. ఆయన స్కిల్స్ పట్ల లోతైన అవగాహన ఉంది. ఆయన ట్విట్టర్కు సారధ్యం వహించే టైం వచ్చింది అని పేర్కొన్నారు.
ఇంతకుముందు ప్రతి ఏడాదిలో ఆరు నెలల పాటు ఆఫ్రికాలో పని చేయాలని జాక్ డోర్సీ ప్రణాళిక వేసుకున్నారు. ఆఫ్రికా ఖండ నెటిజన్ల ఆలోచనలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి వీలుగా జాక్ డోర్సీ ఈ ప్లాన్ రూపొందించుకున్నా.. తర్వాత కరోనా వల్ల రద్దయింది.
టెక్నాలజీ పేమెంట్స్ అండ్ సర్వీసెస్ కంపెనీ స్క్వేర్ ఇంక్ సీఈవోగానూ జాక్ డోర్సీ బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో యాక్టివిస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎల్లియంట్ మేనేజ్మెంట్ కంపెనీ.. జాక్ డోర్సీని సీఈవోగా తప్పించాలని ఒత్తిడి తీసుకొచ్చింది. సంస్థలో లీడర్షిప్, గవర్నెన్స్ను సమీక్షించేందుకు ఈ కంపెనీ ముగ్గురు నూతన డైరెక్టర్లను నియమించింది. సంస్థ పనితీరుపై సమీక్షకు కమిటీని ఏర్పాటు చేసింది.