న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: జెట్ ఎయిర్వేస్ విమానాలు మళ్లీ విహరించనున్నాయి. 2022 తొలి త్రైమాసికంలో దేశీయ కార్యకలాపాల్ని ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో అంతర్జాతీయ రూట్లలో విమానాలు నడుపుతామని జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేసిన అంతర్జాతీయ కన్సార్షియం జలాన్ కల్రాక్ సోమవారం తెలిపింది. దివాలాతీసిన జెట్ ఎయిర్వేస్ పునరుద్దరణకు జలాన్ కల్రాక్ కన్సార్షియం సమర్పించిన ప్రణాళికకు ఈ ఏడాది జూన్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్రవేసిన సంగతి తెలిసిందే. మూడేళ్లలో 50కి పైగా, ఐదేళ్లలో 100కిపైగా విమానాల్ని సమకూర్చుకోవాలన్నది తమ లక్ష్యమని జలాన్ కల్రాక్ కన్సార్షియం లీడ్ మెంబర్ మురళీలాల్ జలాన్ వెల్లడించారు. రెండేళ్లకుపైగా మూలనపడి ఉన్న విమానయాన సంస్థని పునరుద్దరించడం పౌరవిమానయాన చరిత్రలో ఇదే ప్రధమమని, ఈ చరిత్రాత్మక ప్రయాణంలో భాగమయ్యేందుకు ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు.
1,000కిపైగా ఉద్యోగాలు&
ఎన్సీఎల్టీ ఆమోదించిన ప్రణాళిక ప్రకారం జెట్ఎయిర్వేస్ పునరుద్దరణ పథకాన్ని అమలు జరుపుతామని, కొద్ది నెలలో రుణదాతల బకాయిల్ని పరిష్కరిస్తామని కన్సార్షియం ప్రకటన పేర్కొంది. విమానాలకు స్లాట్స్ కేటాయింపు, నైట్పార్కింగ్, ఇతర ఎయిర్పోర్ట్ మౌలిక సదుపాయాల కోసం ఎయిర్పోర్ట్ కో ఆర్డినేటర్లు, సంబంధిత యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నట్లు కన్సార్షియం తెలిపింది. తాత్కాలిక సీఈవోగా నియమితులైన కెప్టెన్ సుధీర్ గౌర్ నేతృత్వంలోని బృందం కీలక విమానాశ్రయాలన్నింటికీ వెళ్లి నిర్వహించిన సమావేశాలు ఫలవంతమయ్యాయని కన్సార్షియం వివరించింది. జెట్ఎయిర్వేస్ ఇప్పటికే 150 మందికిపైగా ఫుల్టైమ్ ఉద్యోగుల్ని తీసుకుందని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో 1,000కిపైగా ఉద్యోగుల్ని నియమించనున్నట్లు మురళీలాల్ జలాన్ తెలిపారు. కన్సార్షియం తాజా ప్రకటన నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో సోమవారం 5 శాతం పెరిగి రూ.83.50 అప్పర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యింది.