Jack Maa on Ant | చైనా బిలియనీర్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా సృష్టికర్త జాక్మా.. తన అలీబాబా అనుబంధ ఫిన్టెక్ సంస్థ ఆంట్ గ్రూప్పై పట్టు వదులుకోనున్నారు. ఆంట్ గ్రూప్లో తన మెజారిటీ వాటాలను విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆంట్ గ్రూప్ షేర్లు పతనం అయ్యాయి. గురువారం స్వల్పంగా పుంజుకున్నా.. జాక్ మా నిర్ణయం బయటకు రావడంతో ఆంట్ గ్రూప్ షేర్లు 0.6 శాతం పతనమై 102.20 డాలర్ల వద్దకు పడిపోయాయి. ఆంట్ గ్రూప్లో వాటాల ఉపసంహరణ విషయమై గురువారం వాల్స్ట్రీట్ జర్నల్లో ఒక వార్తా కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించడానికి అలీబాబా అధికార ప్రతినిధి అందుబాటులోకి రాలేదు. అమెరికా స్టాక్ మార్కెట్లలో లిస్టయిన సంస్థల్లో అలీబాబా ఒకటి.
ఆంట్ గ్రూప్లో జాక్మాకు 10 శాతం వాటా ఉంది. వాటాలను ఉపసంహరించుకోవడంతోపాటు ఓటింగ్ అధికారాలను ఆంట్ గ్రూప్ సీఈవో ఎరిక్ జింగ్ సహా సంస్థ ఉద్యోగులకు బదిలీ చేస్తారని అనధికార వర్గాల సమాచారం. గతేడాదే అలీబాబా అనుబంధ ఫిన్టెక్ సంస్థ ఆంట్ గ్రూప్లో జాక్మా వాటాల ఉపసంహరణ, ప్రత్యామ్నాయాలను ఆ సంస్థ పరిశీలించినట్లు వార్తా కథనాలు వచ్చాయి. 2020 చివర్లో చైనా మార్కెట్ల నియంత్రణ సంస్థల ఆదేశాల మేరకు ఆంట్ గ్రూప్ 37 బిలియన్ డాలర్ల విలువ గల ఐపీవోను అలీబాబా నిలిపివేసుకున్నది. అంతేకాదు చైనా ప్రభుత్వ అదేశాల మేరకు ఆంట్ గ్రూప్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ సాగుతున్నది.
చైనా ప్రభుత్వ సంస్థలు, ఆర్థిక నియంత్రణ సంస్థల సాచివేత ధోరణులు పట్ల బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో జాక్మా ఇబ్బందుల్లో పడ్డారని అప్పట్లో వార్తలొచ్చాయి. నిత్యం వార్తల్లో కనిపించే జాక్మా.. 2020 చివరి నుంచి అరుదుగా తప్ప.. మీడియాకు దూరంగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంట్ గ్రూప్ కేవలం ఫైనాన్సియల్ హోల్డింగ్ కంపెనీగా పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు సమాచారం.