ITR Filing Deadline | ఈ నెల మూడో తేదీ నాటికి 3.03 కోట్ల మంది ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) పత్రాలు దాఖలు చేశారు. ఈ నెలాఖరుతో ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు ముగుస్తుండటంతో రోజురోజుకు ఐటీఆర్ ఫైలింగ్స్ పెరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతి రోజూ 4 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారిలో 50 శాతానికి పైగా ఆన్లైన్ ఐటీఆర్ ఫామ్ సాయంతో ఈ-ఫైలింగ్ పోర్టల్లోనే సమర్పించారని అధికార వర్గాలు తెలిపాయి.
2021-22 ఆర్థిక సంవత్సరం అంచనాలు సమర్పించిన వారిలో ఐటీఆర్ 1 ఫామ్ దాఖలు చేసినవారు 58.98 శాతం (1.78 కోట్లు), ఐటీఆర్-2 పత్రాలు సమర్పించిన వారు 8 శాతం (24.42 లక్షలు), ఐటీఆర్-3 దాఖలు చేసిన వారు 8.7 శాతం (26.58 లక్షలు), ఐటీఆర్-4 ఫామ్స్ సబ్మిట్ చేసిన వారు 23.12 శాతం (70.07 లక్షలు), ఐటీఆర్-5 దాఖలు చేసిన వారు 2.14 లక్షలు, ఐటీఆర్-6 పత్రాలు దాఖలు చేసిన వారు 0.91 లక్షలు, ఐటీఆర్-7 పత్రాలను సమర్పించిన వారు 0.15 లక్షల మంది ఉన్నారు.