హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామికాభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఆగస్టస్ ఒబువాడుం టానో నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ‘తెలంగాణ-ఘనా’ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
ఘనా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 24 అవర్ ఎకానమీ అండ్ యాక్సలరేటెడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, ఫార్మా హబ్ ఏర్పాటు తదితర అంశాలను ఆగస్టస్ ఒబువాడుం టానో వివరించారు. ఘనా పారిశ్రామిక, ఆర్థిక పరివర్తనకు సహకరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అకడ ఏర్పాటు చేయనున్న ‘ఫార్మా హబ్’కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ తదితర రంగాల్లో అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగిందని చెప్పారు.