(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఉత్పాదక సామర్థ్యంలో భారత్ వెనుకబడిపోయింది. భూటాన్, వియత్నాం, ఇండోనేషియా వంటి చిన్న దేశాల కంటే భారత్ స్కోర్ తక్కువగా ఉండటం గమనార్హం. ఉత్పాదక సామర్థ్యాల సూచీ (ప్రొడక్టీవ్ కెపాసిటీస్ ఇండెక్స్)-2022ను యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్(యూఎన్సీటీఏడీ) విడుదల చేసింది.
ప్రజల అక్షరాస్యత, నైపుణ్యాలు, ఆరోగ్య పరిస్థితులు, దేశంలో సహజ వనరులు, వ్యవసాయం, విద్యుత్తు లభ్యత, తయారీ, రవాణా సదుపాయాలు, సమాచార వ్యవస్థ, రాజకీయ స్థిరత్వం, వ్యాపార సౌలభ్యం, ఎగుమతులు-దిగుమతులకు అనువైన వాతావరణం వంటి మొత్తం 42 సూచికల ఆధారంగా దేశాల ఉత్పాదక సామర్థ్యాలను లెక్కగట్టారు. ఈ సూచీలో ప్రపంచంలోనే అధిక జనాభా, అత్యధిక శ్రామిక శక్తి, యువత కలిగిన భారత్ పనితీరు ఏమంత ఆశాజనకంగా లేదు. ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్టున్నది. కాగా, దేశాల అభివృద్ధిని జీడీపీ కంటే ఉత్పాదక సామర్థ్యాల సూచీతోనే బాగా లెక్కించవచ్చని యూఎన్సీటీఏడీ అంటున్నది.