హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యువతలో సృజనాత్మక సామర్థ్యాన్ని పెంపొందించడంలో మేకర్ ఫెయిర్ హైదరాబాద్ కీలకపాత్ర పోషించిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ అన్నారు. టీ వర్క్స్లో రెండు రోజులపాటు జరిగిన మేకర్ ఫెయిర్ హైదరాబాద్ విజయవంతమైందని, యువత నుంచి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. గ్లోబల్ మేకర్ ఉద్యమానికి అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి 30వేల మందికిపైగా తయారీ రంగంలో ఆసక్తి ఉన్నవారు హాజరయ్యారని చెప్పారు. మేకర్లతో రౌండ్ టేబుల్ చర్చలు జరిగాయని పేర్కొన్నారు.
కాగా, సరికొత్త ఆవిష్కరణలకు తెలంగాణ ఎంతో అనుకూలంగా ఉందని.. ఇంజినీరింగ్, డిజైనింగ్, టెక్నాలజీ వర్క్షాప్లలో ప్రయోగాలు చేస్తూ ఔత్సాహికులు ఎంతో అనుభవాన్ని గడించారన్నారు. ఇదిలావుంటే టీ వర్క్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన 18 మీటర్ల పొడవైన మస్కట్ అందరినీ ఆకట్టుకుందన్నారు. టీ వర్క్స్ సీఈవో ఆనంద్ రాజగోపాలన్ మాట్లాడుతూ.. ‘మేకర్ ఫెయిర్ హైదరాబాద్ ఈవెంట్లో సరికొత్త ఆవిష్కరణలు చేయాలన్న పట్టుదలతో ఉన్నవారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీ వర్క్స్ అంటేనే కొత్త వస్తువుల నమూనాల తయారీకి కేంద్రం. అలాంటిచోట ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో వేలాదిమంది ఎంతో ఆసక్తిగా వచ్చి తమ ఆలోచనలకు అనుగుణంగా కొత్త వస్తువుల తయారీలో భాగస్వాములుగా నిలిచారు’ అన్నారు.