బంగారంలో పెట్టుబడి ప్రతీ ఒక్కరి కల. ఇక ఆడపిల్ల తల్లిదండ్రులకు ఈ ఆదుర్దా మరింతగా ఉంటుంది. చిన్న వృత్తులు చేసుకునేవాళ్ల దగ్గర్నుంచి కోటీశ్వరుడి వరకూ పుత్తడిలో మదుపు అనేది ఓ సెంటిమెంట్. అయితే ఈ పేరుతో మనం చేసే కొన్ని తప్పులు మొదటికే మోసం తెస్తాయి. గోల్డ్ కొనిపెడితే ఎప్పుడో ఒకసారి.. ఏదో ఒక అవసరానికి పనికొస్తుంది కదా అనేది మనలో చాలామంది ఇండ్లలో వినిపించే మాట. ఇంతకీ నగలు కొంటే పెట్టుబడి అవుతుందా?.. లోటుపాట్లేంటో చూస్తే… మీరూ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.
మార్కెట్లో ఉన్న పెట్టుబడి సాధనాల్లో బంగారానిదీ ప్రముఖ పాత్రే. నిజానికి రియల్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) కంటే అధిక ప్రాధాన్యత మనం పుత్తడికే ఇస్తాం. ఎందుకంటే ఇదో సురక్షిత పెట్టుబడి సాధనం మరి. అయితే ఆర్థిక నిపుణుల సూచన ప్రకారం మనం పెట్టాలనుకునే ప్రతీ రూ.100 పెట్టుబడిలో బంగారం వాటా 5-10 శాతానికి మించకూడదు. దీన్ని ఓ హెడ్జింగ్, అసెట్ క్లాస్ మాదిరే చూడాల్సి ఉంటుంది. కానీ పెట్టుబడి పేరుతో మనలో అనేకులు నగలు కొనేస్తున్నారు. ఇది మాత్రం ముమ్మాటికీ పెట్టుబడి కానే కాదు.
పైసలు ఊరికే రావు. అందుకే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. బంగారు ఆభరణాలు కొన్నప్పుడు మనం మేకింగ్ ఛార్జీలు, తరుగు పేరుతో చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ముద్దుగా VA అని పేరు పెట్టి నగల దుకాణదారులు కనీసం 15-20 శాతం వరకూ మన ముక్కుపిండి వసూలు చేస్తారు. ఈ లెక్కన మనం మొదట్లోనే ఈ స్థాయి మొత్తాన్ని కోల్పోయినట్టే లెక్క. నాలుగైదేండ్ల తర్వాత డిజైన్ ఛేంజ్ చేసుకునే నెపంతో మరోసారి ఎంతోకొంత సమర్పించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నగలను పెట్టుబడిగా చూడొద్దు. కాకపోతే బంగారు నాణేలు, బిస్కట్లు కాస్త బెటర్. కానీ వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. పైగా హాల్మార్కింగ్, క్వాలిటీ కూడా మరో సమస్య.
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) పెట్టుబడికి అత్యుత్తమం. నెలవారీగా ఇన్వెస్ట్ చేద్దామనుకునేవారికైనా.. పెద్ద మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టాలనుకునేవారికైనా ఇది సరిపోతుంది. బహిరంగ మార్కెట్లో గ్రాముల చొప్పున బంగారం కొన్నట్టే.. ఇక్కడ కూడా కొనొచ్చు. కాకపోతే భౌతికంగా బంగారానికి బదులు ఇది పేపర్ గోల్డ్ అనుకోవాలి. ఆ రోజు మార్కెట్ బులియన్ రేట్ ఎంత ఉంటుందో.. ఇక్కడ కూడా ఒక్కో యూనిట్ ధర అంతే ఉంటుంది. అయితే ఇందుకోసం డీమ్యాట్ ఖాతా ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అధిక శాతం సంస్థలు ఉచితంగా, కనీస ఛార్జీలతో డీమ్యాట్స్ ఇస్తున్నాయి. అదనంగా 0.5-1 శాతం వరకూ నిర్వాహణ ఛార్జీలూ ఉంటాయి.
వివిధ ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు ఈ డిజిటల్ గోల్డ్ మార్కెట్లోకి వచ్చాయి. రూ.100తో కూడా మనం వీటిల్లో పెట్టుబడి పెట్టవచ్చు. పేటీఎం, గూగుల్పే, అమెజాన్ పే సంస్థలు సైతం తమ వేదికల (ఆన్లైన్ వెబ్సైట్స్) ద్వారా విక్రయిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీతోపాటు టాటా డిజిటల్, తనిష్క్, కల్యాణ్ వంటి ప్రైవేట్ సంస్థలూ డిజిటల్ గోల్డ్ను అమ్ముతున్నాయి. వీటికి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వర్తిస్తుంది. పెద్ద సంస్థలను ఎంపిక చేసుకున్నప్పుడు భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన ఉండదు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సందర్భాన్నిబట్టి గోల్డ్ బాండ్లను విక్రయిస్తుంది. ఒక ధరను నిర్ణయించడంతోపాటు రిటైల్ ఇన్వెస్టర్లకు కాస్త రిబేట్నూ కల్పిస్తుంది. అయితే కనీసం ఐదేండ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. లాంగ్ టర్మ్ పెట్టుబడి ఆలోచన ఉన్నవాళ్లకు ఇది అన్నింటికంటే ఉపయుక్తమైన సౌకర్యం. ఏటా దీనిపై 2.5 శాతం వడ్డీ ఆదాయం కూడా లభిస్తుంది. అంతేగాక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (మూలధన లాభాల పన్ను) మినహాయింపూ లభిస్తుంది.
బంగారంలో ఎంతోకొంత పెట్టుబడి పెట్టాల్సిన సమయమిది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం వంటి భయాల మధ్య పుత్తడిలో కొద్దిమొత్తాన్ని దీర్ఘకాలం కోసం ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. సిప్ పద్ధతిలో నెలవారీగా పెట్టుబడులు పెట్టడం ఉత్తమ మార్గం.
-నాగేంద్ర సాయి కుందవరం