PPF Vs NPS | ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేయాల్సిందే. అలా ఉద్యోగాలు చేస్తున్న వారు మొదటి నుంచే భవిష్యత్ పట్ల ముందుచూపుతో వ్యవహరిస్తే ఇబ్బందుల తలెత్తవు. ఆర్థిక పరమైన ఒత్తిళ్లు, ఇబ్బందులు లేకపోతే రిటైర్మెంట్ జీవితంగా హాయిగా, సాఫీగా సాగుతుంది. ఉద్యోగం చేస్తున్నప్పుడు నిత్యం ఉరుకులు, పరుగుల జీవితం.. వర్క్ ప్రెజర్, రెస్పాన్సిబిలిటీస్తో క్షణం తీరికుండదు. ఒక్కోసారి కంటి నిండా నిద్ర కూడా పట్టకపోవచ్చు.
రిటైర్మెంట్ తర్వాత ఏ పని వత్తిడి ఉండదు కనుక స్వేచ్ఛగా నచ్చిన పని చేయొచ్చు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సరదా గడుపొచ్చు. ఇష్టమైన ప్రాంతాలను సందర్శించొచ్చు. కానీ.. ఇవన్నీ ఆర్థిక ఒత్తిళ్లు లేనప్పుడు మాత్రమే చేయగలరు. అలా చేయాలంటే ఏ సంస్థలో పని చేసినా రిటైర్మెంట్ జీవితం కోసం ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి.
రిటైర్మెంట్ ఫండ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీ లైఫ్తోపాటు పెరుగుతున్న ధరలను పరిగణనలోకి తీసుకుంటే.. ఎంత మేరకు పెట్టుబడులు పెట్టాలో తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం.. భారతీయులు తమ సొంత ఇన్కం నుంచి రిటైర్మెంట్ ఫండ్ సమకూర్చుకునేందుకు ప్రోత్సాహం అందిస్తున్నది. ప్రత్యేకించి సామాజిక భద్రత పరిధిలో లేని వారికి టాక్స్ బెనిఫిట్లు కల్పించేలా పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు స్కీమ్ల్లో ఏది ఎంచుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయో చెక్ చేసుకుంటే మంచిదని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్)ను 1968లో కేంద్రం ప్రారంభించింది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ (ఈపీఎఫ్) పరిధిలోకి రాని వారు రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతో కేంద్రం ఈ స్కీం ప్రారంభించింది. ఈ పథకంలో కనిష్టంగా రూ.500, గరిష్టంగా రూ.1.5లక్షలు జమ చేయొచ్చు. 15 ఏండ్ల టైమ్ లిమిట్ ఉంటుంది. ఈ పథకంపై ఏటా 7.10శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. పోస్టాఫీసు, వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పథకం కస్టమర్లకు అందుబాటులో ఉంది.
వివిధ సంస్థల్లో పని చేస్తున్న వారు స్వచ్ఛందంగా కంట్రీబ్యూట్ చేసే పథకం నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్). ఇది స్టాక్ మార్కెట్లతో అనుసంధానమై ఉంటుంది. 18-70 ఏండ్ల మధ్య వయస్కులు సభ్యులుగా చేరొచ్చు. ఇది రిటైర్మెంట్ ఫండ్ కనుక 60 ఏండ్లు దాటే వరకు ఈ స్కీంలో పెట్టుబడులను విత్ డ్రా చేసుకోవడం కుదరదు. 60 ఏండ్ల వయస్సు దాటిన తర్వాత కూడా 60శాతం నిధులు మాత్రమే ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. మిగతా 40 శాతం నిధులతో యాన్యుటీ ఫండ్స్ కొనుగోలు చేయాలి. రూ.5 లక్షల్లోపు ఎన్పీఎస్ నిధి కల వారు మాత్రం రూల్స్ను బట్టి పూర్తిగా విత్ డ్రా చేసుకోవచ్చు. ముఖ్యమైన సమయాల్లో మాత్రమే పాక్షిక విత్ డ్రాయల్స్ను అనుమతి ఇస్తారు.
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీం.. రెండూ రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం ఏర్పాటు చేసినవే. టాక్స్ బెనిఫిట్లు క్లయిమ్ చేయొచ్చు. సుదీర్ఘకాలం లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఈ పథకాల్లో పెట్టుబడులపై పన్ను విధించరు. రిటైర్మెంట్ ఫండ్ కోసం ఇన్వెస్ట్ చేసే వారు అసలు రిస్క్ లేని పథకం అంటే పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్)లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది. కొంత రిస్క్కు సిద్ధంగా ఉంటే నేషనల్ పెన్షన్ స్కీం ఆప్ట్ చేయొచ్చు. ఎన్పీఎస్లో ఇన్వెస్ట్మెంట్లు ఈక్విటీ, డెట్ ఫండ్ల కలయికతో వస్తాయి.
పీపీఎఫ్ మీద ఏటా 7.10 శాతం వడ్డీ అందిస్తున్న కేంద్రం.. మూడు నెలలకోసారి సవరిస్తుంది. ఏడాది ప్రాతిపదికన కలిపేస్తారు. స్టాక్ మార్కెట్లతో లింక్ అయి ఉన్న స్కీం ఎన్పీఎస్లో పెట్టుబడిపై వడ్డీ కచ్చితంగా వస్తుందని చెప్పడం కష్టం.
ఇన్వెస్టర్ల రిస్క్ కెపాసిటీని బట్టి ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్ నిష్పత్తి ఖరారు చేసుకోవచ్చు. ఈక్విటీల్లో 75 శాతం వరకు పెట్టుబడి ఆప్షన్ ఎంచుకునే చాన్స్ ఉంటుంది. దీర్ఘకాలం పొదుపు చేస్తే ఈక్విటీల్లో 12 శాతం, డెట్ ఫండ్స్లో 8 శాతం ఆదాయం పొందొచ్చు. ఈక్విటీ, డెట్ ఫండ్ల మధ్య నిష్పత్తి 60:40గా ఉంటే ఈక్విటీలపై 7.20 శాతం, 3.20 శాతం కలగలిపి 10.40 శాతం ఆదాయం రావచ్చు. 50:50 నిష్పత్తి ప్రకారం దీర్ఘకాలికంగా 10 శాతం ఇన్కం అందుకోవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ పథకంలో వడ్డీరేటు కంటే 2.90 శాతం ఎక్కువ.
పీపీఎఫ్, ఎన్పీఎస్ స్కీమ్లు ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద రూ.1.5లక్షల వరకు టాక్స్ మినహాయింపు క్లయిమ్ చేసుకోవచ్చు. ఎన్పీఎస్లో 80సీసీడీ సెక్షన్ కింద అదనంగా రూ.50 వేలు రాయితీ పొందొచ్చు. అంటే ఎన్పీఎస్లో రూ.2 లక్షల వరకు పొదుపు చేసి పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు.