బీజింగ్: చైనాలో యాపిల్ ఫోన్ల ప్రధాన సరఫరాదారు అయిన ఫాక్స్కాన్ కంపెనీ.. సెంట్రల్ చైనాలోని ఝెంఝౌ ప్లాంటులో పనిచేసే తన కార్మికుల రోజువారి బోనస్ను నాలుగింతలు పెంచింది. దాంతో ఇప్పటివరకు 100 యువాన్లు (13.5 అమెరికన్ డాలర్లు)గా ఉన్న కార్మికుల డైలీ బోనస్.. ఇప్పుడు 400 యువాన్ (55 అమెరికన్ డాలర్లు)లకు పెరిగింది.
ఇంతకూ ఉన్నట్టుండి ఫాక్స్కాన్ కంపెనీ అంత భారీస్థాయిలో కార్మికుల బోనస్ను ఎందుకు పెంచిందనుకుంటున్నారా..? దానికో చిన్న కారణం ఉంది. చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నిబంధనలు కఠినం చేశారు. దాంతో ఫాక్స్కాన్ కంపెనీలో పనిచేసే వర్కర్లపై మేనేజ్మెంట్ కఠిన ఆంక్షలు అమలు చేసింది. దానికితోడు కార్మికుల సౌకర్యాలకు కోతపడింది. ఫ్యాక్టరీలో ఆహార నిల్వలు తరిగిపోయాయి. వైద్య సేవలు కూడా మునుపటిలా అందడంలేదు.
దాంతో విసుగు చెందిన కార్మికులు కంపెనీని విడిచి పారిపోతున్నారు. అరకొర సంపాదన కోసం ఇన్ని ఆంక్షల నడుమ పనిచేయడం అవసరమా..? అనుకుని కంపెనీని వీడి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో కార్మికులు వెళ్లిపోకుండా కాపాడుకోవడం కోసం ఫాక్స్కాన్ బోనస్ను ఎరగా వేసింది. అధిక బోనస్కు ఆశపడి కార్మికులు కష్టమైనా భరించే పరిస్థితిని కల్పించింది.