Omicron Fears | కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం దేశీయ స్టాక్మార్కెట్లపై తీవ్రంగా ఉంది. గత రెండు రోజుల ట్రేడింగ్లో రూ.5,80,016.37 కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. శుక్ర, సోమవారాల్లో ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో అమ్మకాలకు దిగారు. దీంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 949.32 పాయింట్లు పతనమై 56,747.14 పాయింట్ల వద్ద స్థిర పడింది. శుక్రవారం సెషన్లో 764.83 పాయింట్లు నష్టపోయి 57,696.46 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,80,016.37 కోట్లు కోల్పోయి రూ.2,56, 72,774.66 కోట్లకు పడిపోయింది.
రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా మాట్లాడుతూ శుక్రవారం నుంచి మార్కెట్లు 1.65 శాతం నష్టపోయాయి. కరోనా న్యూవేరియంట్ ప్రభావం, అంతర్జాతీయ బలహీనతల మధ్య స్తబ్దుగా సాగిన మార్కెట్లలో సెంటిమెంట్ దెబ్బ తిన్నదన్నారు. దేశవ్యాప్తంగా 21 కొవిడ్-19 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్లో తొమ్మిది, మహారాష్ట్రలోని పుణెలో ఏడు కేసులు రికార్డయ్యాయి. టాంజానియా నుంచి వచ్చిన 37 ఏండ్ల వ్యక్తికి ఢిల్లీలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఒమిక్రాన్ అని తేలింది. ఆ వ్యక్తి రెండు డోస్ల వ్యాక్సిన్ వేయించుకున్నారు.