ముంబై : ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రోజున దేశీయ మార్కెట్లకు కొత్త ఏడాది మొదలవుతుంది. అందులోభాగంగానే ముహూరత్ ట్రేడింగ్ ఉంటుంది. సంవత్ ప్రారంభం సందర్భంగా చాలామందికి ఈ శుభముహూర్తంలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయనే సెంటిమెంట్ ఉంటుంది. అంతేకాదు మన భారతీయులకు ఏదైనా మంచి పని చేసేముందు ముహూర్తం చూసుకొని ప్రారంభించడం ఆనవాయితీ. స్టాక్ మార్కెట్ షేర్ల విషయంలో చాలామంది ఇన్వెస్టర్లు ఈ పండుగను ప్రత్యేకంగా చూస్తారు. ఈ ముహూర్తాన ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏడాదంతా లాభాలు ఆర్జించే అవకాశాలుంటాయని భావిస్తారు.
అందుకోసమే స్టాక్ మార్కెట్లో దీపావళీ పండుగ రోజున ముహూరత్ ట్రేడింగ్ పేరుతో ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహిస్తారు. బీఎస్ఈలో 1957 నుంచి దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. శుభముహూర్తం నేపథ్యంలో ట్రేడింగ్ ఒక పద్ధతిగా మారింది. ఈ ఏడాది కూడా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహించాయి. ముహూరత్ ట్రేడింగ్ అనేది పరిమిత సమయంలో మాత్రమే జరుగుతుంది. ఈ సారి సంవత్ 2078 ప్రారంభం సందర్భంగా గురువారం సాయంత్రం ఒక గంట పాటు ట్రేడింగ్ జరిపారు.