న్యూఢిల్లీ, జూలై 5: ఇన్స్టాంట్ లోన్లపై అధిక వడ్డీతో సతమతమవుతున్న వారికి శుభవార్త. రెండేండ్ల క్రితం ఈ రుణాలపై 58 శాతం వడ్డీని వసూలు చేసిన సంస్థలు ప్రస్తుతం దీనిని 25 శాతానికి తగ్గించాయి. దేశవ్యాప్తంగా లోకల్ సర్కిల్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 27,500 మందిలో 14 శాతం మంది వడ్డీరేటుపై స్పందించారు. 2020లో ఈ రుణాలపై 58 శాతం వడ్డీని వసూలు చేసిన సంస్థలు ప్రస్తుతం ఇది 25 శాతానికి తగ్గించాయని ఈ సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధిక మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. సాధారణంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల లోపు రుణాలపై సంస్థలు 30-60 శాతం మధ్యలో వార్షిక వడ్డీని వసూలు చేస్తున్నాయి.
కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయిన ఎంతో మంది ఇన్స్టాంట్ లోన్లు తీసుకున్నారని సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతో ఈ రుణాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని అభిప్రాయపడింది. మరోవైపు, ఈ రుణాలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తీవ్ర హెచ్చరికలు చేశారు. త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు.