మార్చిలో 5.52 శాతానికి పెరుగుదల
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత ఎగబాకింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.03 శాతంగా నమోదైన వినిమయ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం.. మార్చిలో 5.52 శాతానికి పెరిగి నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఆహార, ఇంధన ధరల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమని సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరిలో 3.87 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం.. మార్చిలో 4.94 శాతానికి దూసుకెళ్లినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) వెల్లడించింది. అలాగే ‘ఫ్యూయల్ అండ్ లైట్’ విభాగంలో ద్రవ్యోల్బణం 3.53 శాతం నుంచి 4.50 శాతానికి పెరిగినట్లు తెలిపింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2020-21 ఆర్థిక సంవత్సర జనవరి-మార్చి త్రైమాసికంలో 5 శాతంగా, ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు త్రైమాసికాల్లో 5.2 శాతంగా ఉండొచ్చని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఇటీవల అంచనా వేసింది. గతేడాది జూన్-నవంబర్ మధ్య కాలంలో వరుసగా ఆరు నెలలపాటు 6 శాతం గరిష్ఠ పరిమితిని అధిగమించిన వినిమయ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పట్టి ఈ ఏడాది జనవరిలో 4.1 శాతానికి దిగివచ్చింది. కూరగాయలు, తృణధాన్యాల ధరలు తగ్గడమే ఇందుకు కారణం. కానీ ఫిబ్రవరిలో ఇది మళ్లీ 5.03 శాతానికి ఎగబాకింది.
ఫిబ్రవరిలో ఐఐపీ 3.6% డౌన్
ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 3.6% క్షీణించింది. తయారీ రంగంలో 3.7%, మైనింగ్ రంగంలో 5.5% చొప్పున ఉత్పత్తి తగ్గినట్లు ఎన్ఎస్వో వెల్లడించింది. అయితే విద్యుత్ రంగంలో ఉత్పత్తి 0.1% పెరిగినట్లు తెలిపింది. గతేడాది ఫిబ్రవరిలో ఐఐపీ 5.2% వృద్ధి చెందడం గమనార్హం. మొత్తంగా చూస్తే గత (2020-21) ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో ఐఐపీ 11.3% క్షీణించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఐఐపీ 1% వృద్ధి చెందింది.
ఇవీ కూడా చదవండి…