TIHCL | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): చిన్న పరిశ్రమలు నష్టాలపాలై మూతపడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. పరిశ్రమలకు కొనుగోలుదారుల (బయ్యర్లు)నుంచి రావాల్సిన మొండి బకాయిలను సత్వరమే ఇప్పించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లు (టీఎస్ఎంఎస్ఈఎఫ్సీ) ఇప్పటివరకు 865 కేసులను పరిష్కరించింది. దీంతో యాజమాన్యాలకు రావాల్సిన రూ.330 కోట్ల బకాయిలు లభించాయి. చాలావరకు చిన్న పరిశ్రమలు తమ ఉత్పత్తులకు సంబంధించి బయ్యర్లు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంవల్ల నష్టాలపాలవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వరంగల్, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డిల్లో ఫెసిలిటేషన్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసింది. నిజానికి తెలంగాణ రాకముందు ఒకే ఒక ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఉండేది. దీంతో పెరుగుతున్న సమస్యల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆరుచోట్ల కౌన్సిళ్లను తెచ్చింది. ఇక ఒక్కో కౌన్సిల్కు పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శిస్థాయి అధికారిని చైర్మన్గా నియమించి న్యాయపరమైన అధికారాల (జ్యూడీషియల్ పవర్స్)ను అప్పగించారు. అలాగే కౌన్సిల్ ఇచ్చిన తీర్పుపై బయ్యర్లు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనుకుంటే సదరు తీర్పు ప్రకారం చెల్లించాల్సిన మొత్తంలో 75 శాతం కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుందనే నిబంధన సైతం విధించారు. అంతేగాక కేసులు గరిష్ఠంగా 90 రోజుల్లో పరిష్కారమయ్యేలా నిబంధనలున్నాయి. దీంతో కేసులు సత్వరమే పరిష్కారం కావడంతోపాటు చిన్న పరిశ్రమలకు ఎంతగానో ఊరట లభించినైట్టెంది.
ఖాయిలాపడిన, నష్టాల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పద్ధతిలో తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (TIHCL) పేరుతో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)ని రూ.10 కోట్ల ప్రారంభ కార్పస్ ఫండ్తో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమ దృష్టికి వచ్చిన పరిశ్రమలను సందర్శించి నష్టాలకు గల కారణాలను పరిశీలించి వాటిని పరిష్కరించడం దీని బాధ్యత. బ్యాంకర్లతో చర్చించి ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు నష్టాల్లో ఉన్న, మూతపడిన 550 ఖాయిలా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది.