Indigo Crisis |దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో డైరెక్టర్ రాకేశ్ గంగ్వాల్ శుక్రవారం తన బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. ఇండిగో పేరెంట్ సంస్థ ఇంటర్ గ్లోవ్ ఏవియేషన్లో తన వాటాలను క్రమంగా ఉపసంహరించుకోనున్నారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్లైన్స్లో ఇండిగో ఒకటి. వచ్చే ఐదేండ్లలో రాకేశ్ గంగ్వాల్ తన వాటాలను విత్డ్రా చేసుకుంటాననన్నారు. ఇతరుల ప్రయోజనానికి తాను రాజీనామా చేసినట్లు తెలిపారు.
ఇండిగో బోర్డుకు, రాకేశ్ గంగ్వాల్కు మధ్య గల విభేదాలు 2019 జూలైలో బయటపడ్డాయి. ఇండిగోలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలను సరిచేసేందుకు జోక్యం చేసుకోవాలని దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి లేఖ రాశారు. ఈ ఆరోపణలను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా సారధ్యంలో ఐజీఈ గ్రూప్ తిరస్కరించింది. భాటియా, రాకేశ్ గంగ్వాల్ మధ్య ఉన్న విభేదాల పరిష్కారానికి అదే ఏడాది ఇరు వర్గాల తరుఫున మధ్యవర్తులు పనిచేశారు. ఇండిగోలో కార్పొరేట్ గవర్నెన్స్లో లోపాలకు రాహుల్ భాటియా కారణం అని రాకేశ్ గంగ్వాల్ ఆరోపించారు. 2015 నాటి షేర్ హోల్డర్ అగ్రిమెంట్ ప్రకారం ఇరువర్గాల మధ్య విబేధాలు పెరిగిపోవడంతో సంస్థ ఫౌండర్లు ఇబ్బందుల్లో పడ్డారు. సంస్థలో తక్కువ వాటా ఉన్నా రాహుల్ భాటియా.. ఇండిగోపై పూర్తి పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారని రాకేశ్ గంగ్వాల్ ఆరోపించారు.
గత డిసెంబర్లో జరిగిన వాటాదారుల సమావేశంలో ఇంటర్ గ్లోవ్ ఏవియేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇండిగో ఎయిర్లైన్స్లో ఇద్దరు ప్రమోటర్లకు పరస్పరం తమ వాటాల కొనుగోళ్లపై ఉన్న రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్ (ఆర్వోఎఫ్ఆర్) నిబంధనను రద్దు చేసింది. 15 ఏండ్లకు పైగా కంపెనీలో పని చేశానని రాకేశ్ గంగ్వాల్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ సంస్థ కో-ఫౌండర్ రాహుల్ భాటియాను తక్షణం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తున్నట్లు ఈ నెల ఆరో తేదీన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ప్రకటించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా రాహుల్ భాటియా ఎటువంటి రెన్యూమరేషన్ తీసుకోరని వెల్లడించింది.