న్యూఢిల్లీ, జూలై 13 : దేశంలో ఎగుమతులను మించి దిగుమతులవుతున్నాయి. ఫలితంగా వాణిజ్య లోటు అంతకంతకు పెరుగుతూపోతున్నది. ఈ క్రమంలోనే జూన్లో 5 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 30.43 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నిరుడు జూన్లో 19.1 బిలియన్ డాలర్లే. అయితే ఈ ఏడాది జనవరిలో 34.68 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఆ తర్వాత ఆ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. కాగా, అధిక ముడి చమురు ధరలే ఇందుకు కారణమని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గత నెల దేశీయ క్రూడాయిల్ దిగుమతులు 19.32 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గతంతో పోల్చితే 40 శాతం పెరిగాయి.
జూన్లో ఇతర దేశాలకు దేశం నుంచి 40.41 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. మునుపటితో చూస్తే 15.5 శాతం వృద్ధి కనిపించింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్-జూన్లో 15.92 శాతం పుంజుకొని 129.32 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 19.89 శాతం పెరిగి 216.18 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితంగా ఈ మూడు నెలల్లో వాణిజ్య లోటు 86.86 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఏప్రిల్-జూన్లో 68.75 బిలియన్ డాలర్లే. కాగా, గత నెలలో ఎలక్ట్రానిక్స్, ఐరన్ ఓర్, హస్తకళలు, మాంసం, పాల ఉత్పత్తుల ఎగుమతులు ఆకర్షణీయంగా జరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఈ సందర్భంగా తెలిపారు.
భారత్ నుంచి అమెరికాకు జూన్లో ఎగుమతులు 1.21 శాతం తగ్గిపోయాయి. 8.17 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. అయితే దిగుమతులు మాత్రం 33.86 శాతం ఎగిసి 5.5 బిలియన్ డాలర్లకు చేరాయి. నిరుడు జూన్లో ఎగుమతులు 8.27 బిలియన్ డాలర్లు, దిగుమతులు 4.11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏప్రిల్-జూన్లో ఎగుమతులు 25.46 బిలియన్ డాలర్లుగా ఉంటే, దిగుమతులు మాత్రం 23.82 శాతం ఎగబాకి 16.65 బిలియన్ డాలర్లను తాకాయి.