ముంబై, జూలై 28: దేశంలో బంగారం కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి. ప్రపంచ స్వర్ణ మండలి దేశీయ విభాగం (డబ్ల్యూజీసీ ఇండియా) వివరాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్-జూన్ (క్యూ2)లో గతంతో పోల్చితే గోల్డ్ డిమాండ్ 43 శాతం ఎగిసింది. 170.7 టన్నులుగా నమోదైంది. నిరుడు ఇదే సమయంలో 119.6 టన్నులుగా ఉన్నది. విలువపరంగా చూస్తే 54 శాతం వృద్ధితో రూ.51,540 కోట్ల నుంచి రూ.79,270 కోట్లకు చేరినట్టు గురువారం విడుదల చేసిన ‘డబ్ల్యూజీసీ గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ2-2022’ నివేదిక చెప్తున్నది. కాగా, వాణిజ్య లోటు, కరెంట్ ఖాతా లోటు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాల పెంపు రూపంలో వేసే భారం.. మార్కెట్లో ధరల పెరుగుదలకు దారితీయవచ్చని ఈ సందర్భంగా డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది. ఇదే జరిగితే రాబోయే త్రైమాసికాల్లో కొనుగోళ్లు పడిపోవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం, డాలర్తో పోల్చితే దిగజారుతున్న రూపాయి మారకం విలువ.. పసిడి దిగుమతులను ఒత్తిడికి లోనుచేస్తున్నాయని పేర్కొన్నది.
డబ్ల్యూజీసీ క్యూ2 నివేదిక ముఖ్యాంశాలు
ఈ ఏడాది దేశంలో గోల్డ్ డిమాండ్ 800-850 టన్నులుగా ఉంటుందని అంచనా. నిరుడు 797 టన్నులు.
కొనుగోళ్లపై ద్రవ్యోల్బణం, బంగారం ధరలు, రూపాయి మారకం విలువ, విధానపరమైన నిర్ణయాల ప్రభావం.
ఈ మార్చి 31న రూ.43,994 పలికిన 10 గ్రాముల బంగారం.. జూన్ 30కి రూ.46,504కు చేరిక.
దేశంలోకి 34 శాతం పెరిగిన పసిడి దిగుమతులు. గత ఏడాది 131.6 టన్నులుగా ఉంటే.. ఈసారి 170 టన్నులకు చేరాయి.
నగలకు డిమాండ్ 49 శాతం ఎగిసి 140.3 టన్నులను తాకింది. క్రిందటి ఏడాది ఏప్రిల్-జూన్లో 94 టన్నులే. విలుపరంగా రూ.40,610 కోట్ల నుంచి రూ.65,140 కోట్లకు చేరింది.
దేశీయంగా ఈ ఏప్రిల్-జూన్లో 18 శాతం పెరిగి 23.3 టన్నులకు చేరిన గోల్డ్ రీసైక్లింగ్. నిరుడు ఇదే వ్యవధిలో 19.7 టన్నులుగా నమోదు.
మొత్తం పెట్టుబడి డిమాండ్ 30.4 టన్నులకు చేరింది. గత ఏప్రిల్-జూన్తో చూస్తే ఇది 20 శాతం ఎక్కువ. విలువపరంగా రూ.10,930 కోట్ల నుంచి రూ.14,140 కోట్లకు వెళ్లింది.
ఈ జనవరి-జూన్లో 15 టన్నుల బంగారం నిల్వల్ని పెంచుకున్న ఆర్బీఐ. నిరుడు మొ త్తంగా 77 టన్నుల కొనుగోలు.
గ్లోబల్ మార్కెట్లో తగ్గిన డిమాండ్
అంతర్జాతీయంగా గోల్డ్ డిమాండ్ నిరుడుతో చూస్తే ఈ ఏప్రిల్-జూన్లో 8 శాతం పడిపోయింది. 984.4 టన్నులకు పరిమితమైనట్టు డబ్ల్యూజీసీ పేర్కొన్నది. గత ఏడాది ఇదే కాలంలో 1,031.8 టన్నులుగా ఉన్నది. పెరుగుతున్న గోల్డ్ ఈటీఎఫ్ల ఔట్ఫ్లో, తగ్గుతున్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల పుత్తడి కొనుగోళ్లు మార్కెట్ను ప్రభావితం చేస్తున్నట్టు చెప్పింది. కాగా, కఠిన ద్రవ్యవిధానాలు, ఆయా దేశాల కరెన్సీలతో బలపడుతున్న డాలర్ మారకం విలువ.. మున్ముందు పసిడి ఆదరణను మరింతగా తగ్గించవచ్చన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా డబ్ల్యూజీసీ వ్యక్తం చేసింది. ఇక నిరుడుతో చూస్తే పన్నులు లేకుండా ఔన్సు బంగారం సగటు ధర ఈ ఏప్రిల్-జూన్లో 1,870 డాలర్లుగా నమోదైంది. పోయినసారి 1,816 డాలర్లుగా ఉన్నది.
పెరిగిన పసిడి ధర
గురువారం బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి రూ.700 ఎగబాకి రూ.51,380ని చేరింది. 22 క్యారెట్లు రూ.650 ఎగిసి రూ.47,100ను తాకింది. ఇక కిలో వెండి ధర రూ.1,200 పుంజుకుని రూ.61,200 వద్ద స్థిరపడింది. మరోవైపు ఢిల్లీ మార్కెట్లో తులం రూ.592 ఎగిసి రూ.51,750ని చేరింది. కిలో వెండి ధర రూ.1,335 ఎగబాకి రూ.56,937ను తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం విలువ 1,747 డాలర్లుగా ఉన్నది. వెండి 19.38 డాలర్లున్నది.
అక్షయ తృతీయ, సంప్రదాయ వివాహాది శుభకార్యాలు ఈ ఏప్రిల్-జూన్లో దేశంలో ఆభరణాల కొనుగోళ్లను పెంచా యి. ఈ క్రమంలోనే 140.3 టన్నులకు చేరాయి. నిరుడు ఇదే సమయంతో పోల్చితే 49 శాతం వృద్ధి కనిపించింది. అయితే పోయినసారి కరోనా ప్రభావంతో తక్కువగా జరిగిన కొనుగోళ్లు కూడా ఈసారి వృద్ధిరేటును పెంచాయి. ఇక ఈ ఏడాది ద్వితీయార్ధం నగల డిమాండ్ పడిపోయే వీలున్నది. బంగారం కొనుగోళ్లపై అదనపు ఆంక్షలకున్న అవకాశాలే ఇందుకు కారణం.
-సోమసుందరం పీఆర్,డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈవో