న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశీయ ఎగుమతులు వరుసగా రెండో నెలా క్షీణించాయి. గత నెల జనవరిలో 32.91 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. నిరుడు జనవరితో చూస్తే ఇది 6.58 శాతం తక్కువ కావడం గమనార్హం. నాడు 35.23 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతకుముందు నెల డిసెంబర్లోనూ 34.48 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. 2021 డిసెంబర్తో పోల్చితే 12.2 శాతం తక్కువ. ఇక దిగుమతుల విషయానికొస్తే.. ఈ ఏడాది జనవరిలో 50.66 బిలియన్ డాలర్లు, పోయిన ఏడాది 52.57 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో 3.63 శాతం తగ్గినైట్టెంది. డిసెంబర్లోనూ తగ్గిన విషయం తెలిసిందే. మరోవైపు జనవరిలో దేశ వాణిజ్య లోటు ఏడాది కనిష్ఠానికి వచ్చింది.
ఎగుమతులు 32.91 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 50.66 బిలియన్ డాలర్లుగా ఉండటంతో వాణిజ్య లోటు 17.75 బిలియన్ డాలర్లుగా నమోదైనట్టు బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది. నిరుడు జనవరిలో 17.42 బిలియన్ డాలర్లుగా ఉన్నది. మళ్లీ ఈ స్థాయిలో నమోదైంది ఇప్పుడే. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్-జనవరి మధ్య దేశ ఎగుమతులు 369.25 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 602.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితంగా వాణిజ్య లోటు దాదాపు 233 బిలియన్ డాలర్లుగా నమోదైంది.