న్యూయార్క్, సెప్టెంబర్ 2: అమెరికా బహుళజాతి సంస్థ, కాఫీ వ్యాపార దిగ్గజం స్టార్బక్స్ సీఈవోగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపికయ్యారు. దీంతో అంతర్జాతీయ సంస్థలకు సార థ్యం వహిస్తున్న భారతీయుల జాబితాలో నరసింహన్ పేరు కూడా చేరినైట్టెంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అడోబ్, అల్ఫాబెట్, ట్విట్టర్ తదితర ప్రముఖ సంస్థలకు సీఈవోలుగా భారతీయులే ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది అక్టోబర్ 1న సీఈవోగా స్టార్బక్స్లో నరసింహన్ చేరనున్నారని ఆ సంస్థ తెలియజేసింది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 1న స్టార్బక్స్ డైరెక్టర్ల బోర్డులోకి నరసింహన్ వెళ్లనున్నారు.
అప్పటిదాకా ఇప్పుడున్న మధ్యంతర సీఈవో హోవర్డ్ చల్ట్తో కలిసి నరసింహన్ పనిచేస్తారని స్టార్బక్స్ ప్రకటించింది. 55 ఏండ్ల నరసింహన్.. ప్రస్తుతం బ్రిటన్కు చెందిన బహుళజాతి ఆరోగ్య, పోషకాల కంపెనీ రెకిట్ బెన్కిసర్ సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ నెల 30న ఈ బాధ్యతల నుంచి నరసింహన్ వైదొలుగుతారని రెకిట్ బెన్కిసర్ ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. వ్యక్తిగత, కుటుంబ కారణాలతో అమెరికాకు తిరిగి వెళ్లిపోవాలని నరసింహన్ నిర్ణయించుకున్నట్టు ఈ సందర్భంగా రెకిట్ తెలిపింది. గతంలో నరసింహన్ పెప్సీకో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. ఇదిలావుంటే స్టార్బక్స్ నాయకత్వ బాధ్యతలు అందుకోగలిగిన సరైన వ్యక్తి నరసింహనేనని ఆ సంస్థ మధ్యంతర సీఈవో హోవర్డ్ అన్నారు. ఇక ఈ అవకాశం రావడంపట్ల నరసింహన్ ఆనందం వ్యక్తం చేశారు. పుణె యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీని అందుకున్న నరసింహన్.. జర్మనీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంబీఏ చదివారు.