న్యూఢిల్లీ, మార్చి 21: అమెరికా, యూరోపియన్ బ్యాంకింగ్ సంక్షోభం సెగ.. భారతీయ ఐటీ రంగానికి తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఐటీ సేవల పరిశ్రమ వృద్ధి తగ్గవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి మరి. సాఫ్ట్వేర్ సర్వీస్ సంస్థల జాతీయ సంఘం నాస్కాం వివరాల ప్రకారం భారత ఐటీ కంపెనీల కస్టమర్లలో ఎక్కువగా అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాల సంస్థలే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) దేశీయ ఐటీ సంస్థల రెవిన్యూలో 41 శాతం వాటా వీటిదే ఉండటం గమనార్హం. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎంఫసిస్, ఎల్టీఐమైండ్ట్రీ తదితర భారతీయ ఐటీ కంపెనీలు.. కొన్ని సంక్షోభ బ్యాంకులకు పెద్ద ఎత్తున ఐటీ సర్వీసులను అందిస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీల ఆదాయం పడిపోనున్నదనే విశ్లేషణలు వస్తున్నాయి.
క్యూ4 ఫలితాలపై ఒత్తిడి
అమెరికా, ఐరోపా బ్యాంకింగ్ సంక్షోభం.. ఈ జనవరి-మార్చి త్రైమాసికానికి (క్యూ4)గాను దేశీయ ఐటీ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలను ప్రభావితం చేయవచ్చని అంటున్నారు. ముఖ్యంగా ఎస్వీబీ దివాలా ప్రక్రియకు వెళ్తుండటం.. టీసీఎస్, ఇన్ఫోసిస్లపై అధికంగానే ప్రభావాన్ని చూపించే వీలుందని పేర్కొంటున్నారు. ఎస్వీబీ ఎక్స్పోజర్.. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్టీఐమైండ్ట్రీలకు 10-20 బీపీఎస్గా ఉండొచ్చని జేపీ మోర్గాన్ నివేదిక అంచనా వేస్తున్నది. అయితే క్యూ4 కంటే ఆ తర్వాతి త్రైమాసికాల్లో ఐటీ కంపెనీల రెవిన్యూ బాగా పడిపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. ఇక భారతీయ ఐటీ రంగంపై స్వల్ప, దీర్ఘకాలిక ప్రభావాలుంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డీల్స్ రాక తగ్గిపోవచ్చని ఈఐఐఆర్ సీఈవో ప్రకాశ్ జైన్ అంటున్నారు.
సంక్షోభం ముదిరితే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన అమెరికా, ఐరోపాల్లో కీలకమైన బ్యాంకింగ్ రంగ వైఫల్యాలు.. ఇప్పుడు మెజారిటీ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సంక్షోభం ముదిరితే ఐటీ రంగమేగాక, ఇతర రంగాలూ దెబ్బతినే వీలుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంక్, క్రెడిట్ స్విస్ల సంక్షోభం.. ఇప్పటికే అక్కడి ఇతర బ్యాంకులను ఒత్తిడికి గురిచేస్తున్న సంగతి విదితమే. ఈ గండం నుంచి బయటపడేందుకు ఇతర బ్యాంకుల అండ తప్పనిసరైపోతున్నది. ఇప్పటికే క్రెడిట్ స్విస్ను యూబీఎస్ టేకోవర్ చేసుకున్నది తెలిసిందే. కాగా, పరిస్థితులు చేజారితే స్టాక్ మార్కెట్లు, బాండ్ మార్కెట్లు, ఎగుమతుల రంగాల్లో ఒడిదుడుకులు తప్పవన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ‘భారతీయ ఐటీ సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలే. అయినప్పటికీ దేశీయ ఐటీ సంస్థలపై అమెరికా, ఐరోపా సంక్షోభ ప్రభావం పెద్ద ఎత్తున ఉండకపోవచ్చనే అనుకుంటున్నాను. కేవలం ఒక్క రంగం వృద్ధి తిరోగమనం దిశగా వెళ్లినంతమాత్రాన మిగతా రంగాల్లో వృద్ధిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు’ అని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.