న్యూఢిల్లీ, మార్చి 1: ప్రపంచంలో వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు ఉన్న భారత్ ఇకముందు ఆ వేగాన్ని కొనసాగించడం సాధ్యంకాదని ఆర్థిక విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 4.4 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. 2022 జూన్తో ముగిసిన మూడు నెలల్లో 13.2 శాతం వృద్ధి రేటును నమోదు చేయగా, సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన 6.3 శాతం వృద్ధితో పోల్చినా ముగిసిన త్రైమాసికంలో భారీగా తగ్గింది. అధిక వడ్డీ రేట్లు, మందకొడి డిమాండ్తో గరిష్ఠ వృద్ధి రేటును కొనసాగించడం కష్టసాధ్యమని వారన్నారు. పెరుగుతున్న వ్యయాల కారణంగా తయారీ రంగం ప్రతికూల వృద్ధిని కనపర్చినట్టు విశ్లేషకులు తెలిపారు.
పూర్తి ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి లక్ష్యాన్ని భారత్ సాధించాలంటే ప్రస్తుత త్రైమాసికంలో 5.1 శాతం వృద్ధి రేటును నమోదు చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. స్వయానా రిజర్వ్బ్యాంకే ఈ జనవరి-మార్చిలో వృద్ధి రేటు 4.2 శాతమే ఉంటుందని ఇటీవలి అంచనాల్లో పేర్కొంది. 2022-23పూర్తి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6 శాతానికే పరిమితమవుతుందని క్వాంట్ఎకో రీసెర్చ్ సంస్థకు చెందిన ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. కొవిడ్ తదుపరి ఏర్పడిన వినియోగ డిమాండ్ అంతరించిపోవడంతో ఇక వృద్ధి రేటు తగ్గుతుందని వారు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదాయం తగ్గడం, వడ్డీ రేట్లు పెరగడంతో మూలధన పెట్టుబడులు మందగిస్తాయని, ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం దేశీ వృద్ధిని దెబ్బతీస్తాయని వారు వివరించారు.
లాక్డౌన్ల సమయంలో వాయిదాపడ్డ కొనుగోళ్ల ద్వారా ఏర్పడిన డిమాండ్ చల్లారడంతో దేశ వృద్ధి నెమ్మదిస్తుందని అంచ నా వేస్తున్నట్టు హెచ్ఎస్బీసీ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ ప్రాణ్జుల్ భండారి చెప్పారు. ఎగుమతులు తగ్గడం, వడ్డీ రేట్లు పెరగడం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.8 శాతానికి పరిమితమవుతుందని, 2023-24లో ఇది 5.5 శాతానికి తగ్గుతుందని భండారి అంచనా వేశారు.