Used Cars | న్యూఢిల్లీ, మే 23: దేశంలోని ప్రీ-ఓన్డ్ కార్ల (యూజ్డ్ కార్ల) విక్రయ మార్కెట్ 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి 1.09 కోట్ల యూనిట్లకు చేరవచ్చని ఇండియన్ బ్లూ బుక్ (ఐబీబీ) తాజా నివేదిక ఒకటి అంచనా వేసింది. దీని విలువ 73 బిలియన్ డాలర్లుగా ఉండగా, ప్రస్తుత విలువతో పోల్చితే రెట్టింపునకుపైనే కావడం గమనార్హం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా యూజ్డ్ కార్ల అమ్మకాలు దాదాపు 51 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. వీటి విలువ 32.44 బిలియన్ డాలర్లుగా ఉన్నది.
‘వ్యక్తిగత వాహనాలకు పెరుగుతున్న ప్రాధాన్యతేగాక, పెరిగిన ఆదాయాలు, స్వల్పకాలంలోనే వాహనాల మార్పు వంటి అంశాలూ.. ప్రీ-ఓన్డ్ కార్ల డిమాండ్ను పెంచేస్తున్నది’ అని ఐబీబీ రిపోర్టు చెప్తున్నది. అలాగే కరోనా తర్వాత చాలామంది వ్యక్తిగత వాహనాల వైపు చూస్తున్నారని, దీంతో యూజ్డ్ కార్లకు డిమాండ్ పెరిగిందని పేర్కొన్నది. ఈ క్రమంలోనే 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి 80 లక్షల యూనిట్లకు యూజ్డ్ కార్ల మార్కెట్ చేరవచ్చన్నది.
కొత్త కార్ల ధరలతో పోల్చితే 15-25 శాతం ధరల్లోనే యూజ్డ్ కార్లు అందుబాటులో ఉంటుండటం ఇప్పుడు ఈ మార్కెట్ను పరుగులు పెట్టిస్తున్నది. ఏదైనా కంపెనీకి చెందిన ఓ మాడల్ కొత్త కారు ధర రూ.10 లక్షలుగా ఉంటే.. అదే మాడల్ పాత కారు ధర రూ.2 లక్షలుగానే ఉండటం.. కస్టమర్లను ఈ వైపు చూసేలా చేస్తున్నదని మార్కెట్ వర్గాలు ట్రెండ్ను విశ్లేషిస్తున్నాయి. కండీషన్లో ఉండి, తక్కువ కిలోమీటర్లు తిరిగి, అప్గ్రేడ్ వెర్షనైతే మరో రూ.50,000ల నుంచి లక్ష రూపాయలు ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. దీంతో అన్నివిధాలా సరిపోయే కారు రూ.2.5 లక్షలు-3 లక్షల్లో వచ్చేస్తున్నది.
ఇక ఇప్పటికే కార్లున్నవారు అప్గ్రేడ్ వెర్షన్లోకి మారడం కూడా యూజ్డ్ కార్ల మార్కెట్లోకి పెద్ద ఎత్తున వాహనాలు వచ్చేలా చేస్తున్నది. ఇదిలావుంటే కుటుంబం మొత్తం తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు ఉండటం, ప్రైవసీ, ఇతరత్రా సౌకర్యాల వల్ల కూడా ఇప్పుడు మధ్యతరగతి వర్గాలు యూజ్డ్ కార్లపైనే ఇష్టం కనబరుస్తున్నాయి. మొత్తానికి లగ్జరీ కార్ల దగ్గర్నుంచి, మిడిల్, స్మాల్ సెగ్మెంట్లలోని కార్లు ఈ ప్రీ-ఓన్డ్ వెహికిల్ మార్కెట్లో లభిస్తున్నాయి.