Tesla Cars | టెస్లా ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకం తగ్గించాలంటే ఆ సంస్థ సీఈవో ఎలన్ మస్క్కు కేంద్ర ప్రభుత్వం ఓ షరతు విధించినట్లు తెలుస్తున్నది. తొలుత విదేశాల నుంచి కార్లు దిగుమతి చేసి అమ్ముతామని, తర్వాతే దేశీయంగా ఉత్పత్తి ప్రారంభిస్తామని టెస్లా సీఈవో ఎలన్మస్క్ వాదిస్తున్నారు. భారత్లో దిగుమతి సుంకాలు ఎక్కువ అని, వాటిని తగ్గించాలని కోరారు. ఇప్పటికే పలు సార్లు ఎలన్మస్క్ డిమాండ్ను కేంద్రం తోసిపుచ్చింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లలో భారత్లో తయారు చేసిన విడి భాగాలను వాడాలని తాజాగా కేంద్రం సూచించినట్లు సమాచారం.
కనీసం 500 మిలియన్ల డాలర్ల విలువ గల విడి భాగాలను కొనుగోలు చేయాలని పేర్కొన్నట్లు తెలిసింది. అలా చేస్తేనే టెస్లా విద్యుత్ కార్లపై దిగుమతి సుంకం తగ్గిస్తామని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కనీసం ఏడాది పాటు 10 నుంచి 15 శాతం విడి భాగాలు టెస్లా కార్లలో అమర్చాల్సిన అవసరం ఉందని ఆ వర్గాల కథనం. అందుకు టెస్లా యాజమాన్యం అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పినట్లు వినికిడి.
దేశీయ కార్ల మార్కెట్లోకి టెస్లా కార్లు రావాలనే తాము కోరుకుంటున్నామని ఆ సంస్థకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దేశీయ సంస్థలకు లబ్ధి చేకూరుస్తామని పేర్కొన్నట్లు వినికిడి. అయినా, ఇప్పటికీ దేశీయ కార్ల మార్కెట్లో పెట్రోల్, డీజిల్ వినియోగ కార్లదే ఆధిపత్యం. ప్రస్తుతం దేశీయ కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు కేవలం ఒక్క శాతమే. దేశీయంగా విడి భాగాలు అమర్చాలన్న విషయమై టెస్లా గానీ, కేంద్ర రవాణాశాఖ అధికార ప్రతినిధి గానీ స్పందించలేదు.
చైనాలో కార్లను తయారుచేస్తున్న టెస్లా సంస్థ.. భారత్ నుంచి విడి భాగాలను ఎగుమతి చేసుకోవాల్సిందేనని కేంద్రం చెబుతున్నట్లు సమాచారం. భారత్లో దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలు ఎక్కువగా ఉన్నాయని టెస్లా సీఈవో ఎలన్మస్క్ గతేడాది ట్వీట్ చేశారు. కానీ సుదీర్ఘ కాలంగా చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో షాంఘైలో తయారవుతున్న కార్ల విక్రయం ప్రతిపాదనను పక్కనబెట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల ప్రారంభంలో సూచించారు. భారత్లో కార్ల తయారీకి ముందుకు రావాలని స్పష్టం చేశారు. కనీసం 15-30 శాతం విడి భాగాలు భారత్లో అసెంబ్లింగ్ చేయాలని పేర్కొన్నారు.