న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో సగటు యూజర్ల సాధికారతను బలోపేతం చేయడానికే నూతన ఐటీ నిబంధనలను అమలులోకి తెచ్చామని కేంద్రం పేర్కొంది. పౌర సమాజం, ఇతర భాగస్వామ్య పక్షాలతో విస్తృత స్థాయిలో చర్చించాకే 2018లో ఈ నిబంధనలను రూపొందించామని వెల్లడించింది.
భారత్ అమలులోకి తెచ్చిన నూతన ఐటీ నిబంధనలు అంతర్జాతీయ మానవ హక్కుల నియమావళిని పాటించలేదని ఐక్యరాజ్యసమితి (ఐరాస) అభిప్రాయపడింది. ఐటీ నిబంధనలపై ముగ్గురు ఐరాస మానవ హక్కుల మండలి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 11న లేఖ రాశారు.
దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘సోషల్ మీడియాలో సాధారణ యూజర్ల సాధికారత కోసమే ఈ నియమాలు రూపొందించాం. సోషల్ మీడియా దుర్వినియోగం బారిన పడ్డ బాధితుల వేదన పరిష్కారానికి ఇదొక వేదిక అవుతుంది’ అని ఐరాసకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది.
సోషల్ మీడియాతోపాటు డిజిటల్ వేదికలపై వేధింపులు, ఉగ్రవాద కార్యకలాపాల కోసం నియామకాలు, అశ్లీల కంటెంట్, ఆర్థిక మోసాలు, హింసను ప్రేరేపించే సమాచార వ్యాప్తిని నిరోధించాల్సి వచ్చిందని తెలిపింది. అందుకే కొత్తగా ఐటీ నిబంధనలు రూపొందించామన్నది.