Smartphones | గతంతో పోలిస్తే స్మార్ట్ ఫోన్ల విక్రయాలు క్రమంగా తగ్గుతున్నాయి. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో మూడు శాతం సేల్స్ తగ్గాయి. స్మార్ట్ ఫోన్ల విక్రయాలు పతనమైనా.. మొత్తం మార్కెట్ షేర్లో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్దే ప్రథమ వాటా. 79 లక్షల స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లో 18 శాతం వాటా శాంసంగ్ పొందింది. ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లో ఆవిష్కరించిన గెలాక్సీ ఎస్23 ఫోన్ విక్రయాలతో శాంసంగ్ మార్కెట్ వాటా పెరుగుదలకు కారణం అయ్యాయి.
తర్వాతీ స్థానంలో చైనా టెక్ జెయింట్ షియోమీ, వివో, రియల్మీ, ఒప్పో ఫోన్లు టాప్-5లో చోటు దక్కించుకున్నాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనలిస్ (Canalys) పేర్కొంది. పండుగల సీజన్ నేపథ్యంలో మున్ముందు స్మార్ట్ఫోన్ల సేల్స్ పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్లో 3.4 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయని కెనలిస్ నివేదిక పేర్కొంది.
79 లక్షల ఫోన్ల విక్రయాలతో మార్కెట్లో 18 శాతం వాటాతో శాంసంగ్ మొదటి స్థానంలో నిలవగా, 76 లక్షల ఫోన్ల సేల్స్తో 21 శాతం మార్కెట్ వాటాతో షియోమీ రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. చౌక ధరకే 5జీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి తేవడం షియోమీకి కలిసి వచ్చింది. వివో 72 లక్షల ఫోన్ల (16 శాతం) విక్రయంతో మూడో స్థానం, 58 లక్షల (14 శాతం) ఫోన్లతో రియల్మీ, 12 శాతం మార్కెట్ వాటా (44 లక్షల ఫోన్లు)తో ఐదో స్థానంలో ఒప్పో నిలిచింది. ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్, ఆపిల్ ఐ-ఫోన్ 14, ఐ-ఫోన్ 13 సిరీస్లతో సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విక్రయాలు పుంజుకున్నాయి.