Privatisation of Banks | ఆర్థిక రంగంలోకి నిధుల వరద పారించేందుకు ప్రధాని నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకోసం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల ఉపసంహరణ ప్రక్రియ సరళతరం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకు అనుగుణంగా చట్టాల్లో సవరణలను తేవాలని భావిస్తున్నది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను క్రమంగా 51 శాతం నుంచి 26 శాతానికి తగ్గించడానికి వీలవుతుంది. అయితే, ఆయా బ్యాంకుల్లో యాజమాన్య నియామక అధికారం ప్రభుత్వానికే ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అందుకోసం 1969లో బ్యాంకుల జాతీయకరణ చట్టానికి సవరణలు తేనున్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న బ్యాంకుల ప్రైవేటీకరణ ప్లాన్ అమల్లోకి వచ్చేస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జీవిత బీమా సంస్థలో కేంద్ర ప్రభుత్వ వాటాలను ఉపసంహరించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. తదనుగుణంగా కేంద్రం రెండు బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ వాటాల ఉపసంహరణతోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను అనుమతించేందుకు రంగం సిద్ధం అవుతున్నది. ఇందుకు క్యాబినెట్ ఆమోదం కోసం ఆర్థిక శాఖ ముసాయిదా సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ జాబితాలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ) ఉన్నాయని తెలుస్తున్నది.
ఈ ప్రతిపాదనలకు చట్టరూపం లభిస్తే బ్యాంకుల ప్రైవేటీకరణ సరళతరం కానున్నది. పార్లమెంట్ ఆమోదం లేకుండా విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారీ స్థాయిలో వాటాల కొనుగోలుకు అనుమతి లభించినట్లేనని చెబుతున్నారు. ఇలా ప్రైవేటీకరించడానికి అనుకూల బ్యాంకులను గుర్తించడం తేలిక కానున్నది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి నిరంతరం ప్రభుత్వం నిధుల జోడింపు తగ్గించాలని సదరు సవరణలు ప్రతిపాదిస్తున్నాయని సమాచారం. డిపాజిటర్ల డబ్బుకు భద్రత కల్పించేలా బ్యాంకులపై ప్రభుత్వానికి క్వాసీ-సావరిన్ హోదా ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మూడింట రెండొంతుల వాటా ప్రభుత్వానిదే. ఆయా బ్యాంకుల్లో భారీ మొత్తంలో మొండి బకాయిలున్నాయి.
ఆర్బీఐ అంగీకారంతో బ్యాంకుల ప్రైవేటీకరణకు పార్లమెంట్ ఆమోద ప్రక్రియ వేగవంతం చేయాలి. అందుకు అనుగుణంగా నిబంధన చేరుస్తారు. ప్రభుత్వ వాటా 51 నుంచి 26 శాతానికి తగ్గించవచ్చు. విదేశీ వాటాదారులు 20 శాతం వరకు వాటాలు కొనుగోలు చేయొచ్చు. ఇక ఎంతో కాలం సింగిల్ షేర్ హోల్డర్కు ఓటింగ్ హక్కులకు 10 శాతానికి పరిమితం కావు. బ్యాంకుల ప్రైవేటీకరణ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంశం. దీనికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా బ్యాంకుల ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
బ్యాంకుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెట్టేందుకు 20 శాతం వరకే ప్రస్తుత చట్టాలు అనుమతిస్తున్నాయి. దీన్ని 26 శాతానికి పెంచితేనే పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చునని కేంద్రం భావిస్తున్నది. అలా చేయాలంటే చట్టాలకు సవరణలు చేయడం తప్పనిసరి. ఇక ఈ రెండు బ్యాంకుల్లో పని చేస్తున్న సిబ్బందిని ఇంటికి సాగనంపేందుకు ఆకర్షణీయ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకం కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.