లండన్: వచ్చే 25 ఏండ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో సాధించే ప్రగతి యావత్ ప్రపంచాన్నే విప్లవాత్మకంగా మార్చి వేస్తుందని గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ చెప్పారు. ఇవి మానవాళి అభివృద్ధి చేసిన అత్యంత గొప్ప సాంకేతిక విప్లవాలుగా ఉండబోతాయని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్.. మానవ జీవితాన్ని కనీవినీ ఎరుగని రీతిలో భారీగా ప్రభావితం చేస్తాయని అన్నారు. అగ్ని, విద్యుత్, ఇంటర్నెట్ మాదిరిగానే భవిష్యత్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే అత్యవసరం అవుతుందన్నారు.
కృత్రిమ మేధ సాయంతో కొన్ని పనులను మనుష్యుల కంటే సమర్ధవంతంగా చేయొచ్చునని సుందర్ పిచ్చాయ్ అన్నారు. ఫిజికల్ కార్యక్రమాలకంటే ఆన్లైన్ కార్యక్రమాలే ఊపందుకున్నాయని చెప్పారు. ఇప్పుడంతా డిజిటల్ యుగం అని వ్యాఖ్యానించారు.
ఇటీవల కొన్ని దేశాల్లో ఉచిత, అనియంత్రిత ఇంటర్నెట్ వాడకం ఇబ్బందుల్లో పడిందని చైనాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చాలా దేశాలు సమాచార ప్రవాహాన్ని నియంత్రిస్తున్నా యన్నారు. చైనాలో మేజర్ ప్రొడక్ట్స్ గూగుల్ ఏవీ అందుబాటులో లేవని తెలిపారు.
మౌలికంగా మనిషి మేధస్సును యంత్రాల్లోకి చొప్పించి, అనేక రెట్లు దాన్ని వృద్ధి చేసి, పనిచేయించడమే కృత్రిమ మేధ అని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక కృత్రిమ మేధ వ్యవస్థలు మనుషుల కంటే మిన్నగా అనేక సమస్యలను పరిష్కరిస్తున్నాయని గుర్తు చేశారు.