Apple Focus on India | కరోనా మహమ్మారి పట్ల చైనా అనుసరిస్తున్న విధానం.. భారత్, వియత్నాంలకు అనుకూలంగా మారుతున్నదా.. అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఇప్పటి వరకు చైనాలో అధికంగా ఐ-ఫోన్లు ఉత్పత్తి చేసిన టెక్ దిగ్గజం ఆపిల్.. ఇకనుంచి భారత్, వియత్నాంలలో తమ ఐ-ఫోన్ల ఉత్పత్తి పెంచాలని యోచిస్తున్నది. కాలిఫోర్నియా కేంద్రంగా పని చేస్తున్న కుపరిటినో ఆధ్వర్యంలో కాంట్రాక్ మాన్యుఫాక్చరర్స్ ద్వారా 90 శాతానికి పైగా ఐ-ఫోన్లు ఉత్పత్తి చేసింది ఆపిల్.
కానీ, కరోనాను పూర్తిగా కట్టడి చేసేందుకు చైనాలో అమలు చేస్తున్న లాక్డౌన్, ఇతర కఠిన ఆంక్షలతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడంతోపాటు ఆపిల్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్న భారత్, వియత్నాంలలో ఐఫోన్ల ఉత్పత్తిని పెంచాలని భావిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ వార్తా కథనం ప్రచురించింది. దీనికి తోడు ఉక్రెయిన్పై రష్యా దాడికి చైనా పరోక్షంగా మద్దతు తెలిపిన నేపథ్యంలో ఆపిల్ తన వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తున్నది.
ఐఫోన్ల తయారీ విషయమై ఇతర దేశాల వైపు ఆపిల్ దృష్టి సారిస్తే.. ఇతర పాశ్చాత్య దేశాల సంస్థలు తమ వైఖరిని మార్చుకోనున్నాయని తెలుస్తున్నది. అందుకనుగుణంగా తమ ఉత్పత్తిదారులకు ఇతర ప్రాంతాల్లో ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కల్పించాలని ఆపిల్ చెప్పినట్లు సమాచారం. కరోనా నియంత్రణకు డ్రాగన్ విధించిన ఆంక్షల వల్ల చైనాలోని తమ ఐ-ఫోన్ల తయారీ యూనిట్లను సందర్శించడానికి ఆపిల్ ఎగ్జిక్యూటివ్లు, ఇంజినీర్లకు తక్కువ అవకాశాలు లభించాయి.
మానవ వనరులతోపాటు నైపుణ్య పరంగా చైనాతో భారత్ సమాన స్థాయిలో ఉంది. చైనా మాదిరే ఐఫోన్ల ఉత్పత్తిపై రాయితీలు కల్పిస్తున్నది భారత్. భారత్లో తక్కువ ఖర్చుతోనే ఐ-ఫోన్లు ఉత్పత్తి చేయొచ్చు. గతేడాది 3.1 శాతం ఐఫోన్లు భారత్లో ఉత్పత్తయితే, ఈ ఏడాది 6-75 శాతం మధ్య పెరుగొచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ సారాంశం. ఫాక్స్కాన్, విస్ట్రన్ సంస్థలు ఇప్పటికే భారత్లో ప్రొడక్షన్ యూనిట్లు కలిగి ఉన్నాయి. విదేశాలకు ఎగుమతి చేయడంతోపాటు భారత్లో సరఫరాకు కొందరు సప్లయర్లతో ఆపిల్ చర్చలు జరుపుతున్నదని సమాచారం.
అయితే, చైనాలో ఆపిల్ సప్లయర్లు.. భారత్ కంటే వియత్నాం వైపు మొగ్గు చూపొచ్చునని సమాచారం. గాల్వన్ లోయలో చైనా-భారత్ సేనల ఘర్షణతో సరిహద్దు వివాదం నెలకొంది. దీనికితోడు భారత్లో చైనా సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టడం కూడా ఒక కారణంగా కనిపిస్తున్నది.