ముంబై, జూలై 29: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కదలాడటంతో మదుపరుల సంపద భారీగా పెరిగింది. మూడు రోజుల్లో రూ.9 లక్షల కోట్లపైనే ఎగిసింది. బుధ, గురు, శుక్రవారాల్లో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,301.76 పాయింట్లు లేదా 4.16 శాతం పుంజుకున్నది. ఈ క్రమంలోనే మదుపరుల సంపద రూ.9,03,574.58 కోట్లు ఎగబాకింది. ఫలితంగా బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ రూ.2,66,58,604.02 కోట్లను తాకింది.
కొనుగోళ్ల జోష్
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు మదుపరులు క్యూ కడుతున్నారు. శుక్రవారం కూడా ఇదే ఉత్సాహం కనిపించింది. దీంతో సెన్సెక్స్ 712.46 పాయింట్లు లేదా 1.25 శాతం పెరిగి 57వేల మార్కును దాటుతూ 57,570.25 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 761.48 పాయింట్లు బలపడి 57,619.27 స్థాయినీ తాకింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 228.65 పాయింట్లు లేదా 1.35 శాతం అందుకుని 17వేల మార్కును అధిగమిస్తూ 17,158.25 వద్ద స్థిరపడింది. మెటల్, ఎనర్జీ, బేసిక్ మెటీరియల్స్, చమురు-గ్యాస్, ఐటీ, టెక్నాలజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు ఆకట్టుకున్నాయి. ఇక బీఎస్ఈ స్మాల్క్యాప్ 1.38 శాతం, మిడ్క్యాప్ 1.01 శాతం పెరిగాయి. కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండటం, విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబర్చడం కలిసొచ్చిందని నిపుణులు మార్కెట్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా లాభాల్లో.. జపాన్, చైనా, హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలు జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్లు లాభాల్లోనే కదలాడాయి.
రూపీ 45పైసలు జంప్
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో 45పైసలు బలపడి 79.24 వద్ద స్థిరపడింది. ఇది మూడు వారాల గరిష్ఠస్థాయి కావడం గమనార్హం. అంతేగాక గడిచిన 9 నెలల్లో ఒక్కరోజే ఈ స్థాయిలో రూపాయి పెరగడం కూడా ఇదే తొలిసారి. నిరుడు అక్టోబర్ 20 తర్వాత మళ్లీ ఇప్పుడే ఇంతలా పెరిగింది. కాగా, స్టాక్ మార్కెట్ల భారీ లాభాలు, ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల రాక కలిసొచ్చాయని ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. గురువారం రూపాయి విలువ 22 పైసలు పుంజుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు రోజు మాత్రం 13 పైసలు క్షీణించింది.