ITR Filing | ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వేతన జీవులు నూతన వెర్షన్ ఐటీఆర్ సాఫ్ట్వేర్ను వాడాలని ఆదాయం పన్నుశాఖ కోరింది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో లేట్ ఫీజు లేదా అదనపు ఫీజు చెల్లిస్తే.. తిరిగి రీఫండ్ చేస్తామని ఇటీవలే ఆదాయం పన్నుశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సాధారణ పన్ను చెల్లింపుదారులు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీంతో గత ఆర్థిక సంవత్సరం ఐటీఆర్ ఫైలింగ్ గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.
అయితే 2020-21 ఆర్థిక సంవత్సరం ఐటీఆర్ ఫైలింగ్స్ జూలై 31 తర్వాత ఫైల్ చేయడంతో అదనపు వడ్డీ, లేట్ ఫీజు చెల్లించామని పలువురు పన్ను చెల్లింపుదారులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఐటీ శాఖ వడ్డీపై పొరపాటు అంచనాలు, లేట్ ఫీజు రూపంలో చెల్లించినా సీపీసీ-ఐటీఆర్ పూర్తిగా క్యాలిక్యులేట్ చేసి మొత్తం రీఫండ్ చేస్తామని పేర్కొంది.
ఇదిలా ఉంటే ఐటీఆర్ ఫైలింగ్లో సాంకేతిక లోపాలను ఈ నెల ఒకటో తేదీన సరిదిద్దామని ఐటీ శాఖ ట్వీట్ చేసింది. దీంతో 234ఏ ప్రకారం తప్పుడు వడ్డీ, 234ఎఫ్ ప్రకారం లేట్ ఫీజు చెల్లించాలని సూచించిన టూల్ను తొలగించామని వెల్లడించింది.
అయితే గడువు దాటాక ఐటీఆర్ ఫైలింగ్తో రెండు ప్రధాన ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐటీ చట్టం 234ఏ సెక్షన్ ప్రకారం ఐటీఆర్ ఫైలింగ్లో జాప్యం జరిగితే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 234ఎఫ్ సెక్షన్ ప్రకారం గడువు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే రూ. 10 వేల వరకు అపరాధ రుసుము (పెనాల్టీ ఫీజు) చెల్లించాలి.