Tax Saving Schemes | మరో కొద్ది రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ముగుస్తున్నది. వేతన జీవులైనా, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్) అయినా, కార్పొరేట్లయినా, వ్యాపారులైనా ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని బట్టి ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. తమ ఆదాయంపై వర్తించే పన్ను మినహాయింపు కోసం పొదుపు పథకాల్లో పెట్టుబడులకు ఈ నెలాఖరే తుది గడువు. పన్ను ఆదా చేయడంతోపాటు పిల్లలు, రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా భరోసా కల్పించే పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకు మూడు ముఖ్యమైన పన్ను ఆదా స్కీమ్లు ఉన్నాయి.. వాటిపై ఓ లుక్కేద్దామా..!
వేతన జీవులు తమ ఆదాయం ఇన్కం టాక్స్ చట్టం పరిమితిని మించి ఉంటే ఆయా ఆదాయ శ్లాబ్లను బట్టి పన్ను చెల్లించాలి. అయినా ఆదాయం పన్ను చట్టం-1961 ప్రకారం కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వారిల్లో స్పెషల్గా ప్రస్తావించాల్సినదీ 80సీ సెక్షన్. దీని కింద ఒక ఏడాదిలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పొదుపు చేయొచ్చు.
80సీ సెక్షన్ పరిధిలోకి ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ (ఈపీఎఫ్), ఐదేండ్ల పన్ను ఆదా బ్యాంకు డిపాజిట్లు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (ఎన్ఎస్సీ), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం (ఎస్సీఎస్ఎస్), ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ఎస్ఎస్), ఇంటి రుణం అసలు చెల్లింపు, ఇద్దరు పిల్లల విద్యా కోర్సుల ట్యూషన్ ఫీజు పేమెంట్స్ దీని కిందకు వస్తాయి.
నికరమైన రిటర్న్స్ ఇచ్చే పథకాలను ద్రవ్యోల్బణం కోణంలో చూస్తే పెద్ద ఆదాయం ఉండదు. వీటి నుంచి వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలి. మార్కెట్ లింక్డ్ పన్ను పొదుపు పథకాల్లో కాసింత నష్టభయం ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్తోపాటు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు (యూలిప్), నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) వంటి స్కీమ్స్లో దీర్ఘకాల పెట్టుబడి వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వచ్చే రిటర్న్స్ మీద పెద్దగా టాక్స్ చెల్లించాల్సిన అవసరం రాదు..
స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్తోపాటు ఇన్సూరెన్స్ సెక్యూరిటీ కల్పించే పథకాలు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు (యూలిప్). ఇన్వెస్ట్మెంట్, సెక్యూరిటీ లింక్డ్ పథకాల్లో వేర్వేరుగా పెట్టుబడి పెట్టలేని వారికి యూలిప్ స్కీమ్స్ వెసులుబాటుగా ఉంటాయి. ఇవి 15-20 ఏండ్ల దీర్ఘకాలిక పథకాలు. వయస్సుతోపాటు గడువు, కుటుంబ అవసరాలను పరిగణనలోకి తీసుకుని యూలిప్ ప్రీమియం ఖరారు చేసుకోవాలి.
యూలిప్ పాలసీల్లో మీరు చెల్లించే ప్రీమియంపై కనీసం 10 రెట్లు బీమా పాలసీ ఉండేలా చూసుకోవాలి. 15-20 రెట్లు ఉంటే మరీ బెటర్గా ఉంటుంది. వివిధ లక్ష్యాలకు అనుగుణంగా దీర్ఘకాలిక యూలిప్ స్కీంలో పెట్టుబడి పెట్టడం ఎంతో మంచిది. పాలసీ గడువు ముగిసే వరకు ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. పలు యూలిప్లు, ఈక్విటీ, డెట్ ఫండ్ల ఎంపికకు దాదాపు 5-9 రకాల పథకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ జీవిత లక్ష్యాలకు అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. వీటిలో కొన్ని స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ పండ్స్ ఉంటాయి. మల్టీ క్యాప్, థీమాటిక్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. నష్ట భయాన్ని భరించే సామర్థ్యాన్ని బట్టి ఫండ్స్ ఎంచుకోవాలి. అంతే కాదు.. ఒక ఫండ్లో పెట్టుబడి పెట్టిన కొన్ని రోజులకు నిబంధనలకు లోబడి ‘స్విచ్ఛింగ్’ ఆప్షన ఉంటది.
10 నుంచి 15 ఏండ్ల పాటు ప్రీమియం చెల్లించడానికి అడ్డంకుల్లేవనుకున్నప్పుడే యూలిప్ పాలసీలు ఎంచుకోవాలి. వైవిధ్యభరితమైన ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. లక్ష్యాన్ని చేరుకుంటున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీ ఫండ్స్ నుంచి డెట్ ఫండ్స్లోకి మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఐదేండ్ల తర్వాత కొంత పెట్టుబడి పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఈ ఫెసిలిటీ వాడుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
పన్ను పొదుపుతోపాటు రిటైర్మెంట్ తర్వాత ఉపకరించాలనుకుంటే జాతీయ పెన్షన్ పథకం (ఎన్పీఎస్) మంచి ఆప్షన్ అవుతుంది. ఈ పథకంపై పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణ, పర్యవేక్షణ ఉంటుంది. ఉద్యోగంలో కొనసాగుతున్నప్పుడు పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ తీసుకునేందుకు వెసులుబాటుగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ను బట్టి పెన్షన్ లభిస్తుంది. ఇది కూడా స్టాక మార్కెట్ లింక్డ్ పథకమే. రిటర్న్స్కు ఖచ్చితమైన గ్యారంటీ ఉండదు కానీ.. ఇతర పెన్షన్ పథకాలతో సరిపోలిస్తే ఎన్పీఎస్లో ఖర్చుల నిష్పత్తి తక్కువ.
రిటైర్మెంట్ వరకు జమ చేసిన మొత్తంలో 60 శాతం వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతం ఫండ్స్తో ఏడు సంస్థల్లో యాన్యుటి ఫండ్స్ కొనుగోలు చేయాలి. ఈ యాన్యుటీ ఫండ్స్పై వచ్చే ఆదాయమే పెన్షన్గా అందుకోవచ్చు.
వయస్సు, నష్టభయం ఆధారంగా వీటిని ఆప్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ, నికర ఆదాయం లభించే స్కీమ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు ప్రధానంగా ఉంటాయి. ఈ పథకం కింద పెట్టుబడిపై ఆదాయం పన్ను చట్టం 80 సీసీడీ (1బీ) సెక్షన్ కింద రూ.50 వేల వరకు స్పెషల్ మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు.
ఇన్వెస్ట్మెంట్లపై అధిక ఆదాయం పొందుతూ పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారికి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) ఉపకరిస్తాయి. ఈ ఫండ్స్ పెట్టుబడులను 80 శాతం ఈక్విటీ, 20 శాతం ఈక్విటీ లింక్డ్ స్కీమ్ల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువైన స్కీమ్లు ఇవి. ఈ పెట్టుబడులు కనీసం మూడేండ్లు కొనసాగించాల్సిందే. అంతకంటే ఎక్కువ కాలం కొనసాగిస్తే మెరుగైన లాభాలు ఉంటాయి.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్లో ఒకేసారి గానీ, క్రమానుగతంగా అంటే సిస్టమాటిక్గా గానీ పెట్టుబడి పెట్టొచ్చు. మార్కెట్ ఒడిదొడుకుల మధ్య రిటర్న్స్ కావాలనుకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.