అత్యంత విలువైన దేశీయ సంస్థల్లో తెలంగాణ కంపెనీలు మెరుస్తున్నాయి.టాప్-500లో రాష్ర్టానికి చెందినవే 31 ఉండటం విశేషం. ఇందులో 16 సంస్థలు హెల్త్కేర్ రంగానివే కావడం గమనార్హం. ఉపాధి కల్పన, ఉద్యోగావకాశాల్లో రాష్ర్టానికేగాక.. దేశానికే తలమానికంగా వెలుగొందుతున్నాయి. ఈ కంపెనీల్లో 2 లక్షలకుపైగా ఉద్యోగులున్నారు మరి.
హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ బిజినెస్ డెస్క్): దేశంలోని అత్యంత విలువైన సంస్థలకు సంబంధించి తాజాగా విడుదలైన బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 జాబితాలో తెలంగాణ కంపెనీలు 31 చోటు దక్కించుకున్నాయి. వీటన్నిటి విలువ రూ.5 లక్షల కోట్లపైనేనని తేలింది. దివీస్, రెడ్డీస్, అరబిందో టాప్-3లో ఉన్నా యి. టాప్-10లో 7 సంస్థలు హెల్త్కేర్వే అవగా, మొత్తం 31 సంస్థల్లో 16 ఈ రంగానివే. ఐటీ కంపెనీలు 4 ఉండగా, కెమికల్స్, నిర్మాణ, ఇంజినీరింగ్ రంగాలకు చెందినవే రెండేసి చొప్పున ఉన్నాయి.
దేశంలోని టాప్-500 అత్యంత విలువైన కంపెనీల్లో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా రెండో ఏడాదీ అగ్రస్థానంలో నిలిచింది. దీని విలువ ఈసారి రూ.17.25 లక్షల కోట్లుగా ఉన్నది. గడిచిన ఏడాది కాలంలో 3.6 శాతం పెరగగా, గత ఐదేండ్లలో మదుపరులకు రూ.10.52 లక్షల కోట్ల సంపదను అందించింది. రూ.11.6 లక్షల కోట్లతో రెండో స్థానంలో టీసీఎస్, రూ.8.3 లక్షల కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడో స్థానంలో ఉన్నాయి. ఇక టాప్-10లో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్ప్రైజెస్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ప్రపంచంలోనే కొన్ని అత్యంత విలువైన హెల్త్కేర్ కంపెనీలకు తెలంగాణ నెలవు. దివీస్, డాక్టర్ రెడ్డీస్, అరబిందో, లారస్, హెటిరో వంటి ప్రముఖ ఔషధ రంగ సంస్థలు ఈ రాష్ర్టానికి చెందినవే. తాజా జాబితాలో తెలంగాణకు చెందిన 16 హెల్త్కేర్ కంపెనీలున్నాయి. ఔషధాలనేగాక, ఆ ఔషధాల తయారీలో వినియోగించే ముడి సరుకు ఉత్పత్తిలోనూ ఇవి ఎదుగుతుండటం విశేషం. మున్ముందు మేము ప్రకటించే అత్యంత విలువైన భారతీయ టాప్-500 సంస్థల జాబితాల్లో తెలంగాణకు చెందినవి మరిన్ని ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను.
-అనస్ రహ్మాన్ జునైద్,హురున్ ఇండియా ఎండీ