భువనేశ్వర్ : కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి క్యాంపస్ ప్లేస్మెంట్స్పై ఎలాంటి ప్రభావం చూపకపోవడం ఊరట ఇస్తోంది. తాజాగా భువనేశ్వర్ బీటెక్ విద్యార్ధులు రికార్డు స్ధాయిలో టాప్ ప్లేస్మెంట్స్ దక్కించుకున్నారు. 2021-22 సీజన్లో ఐఐటీ భువనేశ్వర్లో 55 శాతం పైగా బీటెక్ గ్రాడ్యుయేట్లు కేవలం మూడు రోజుల్లోనే ప్రముఖ కంపెనీల్లో ఆకర్షణీయ ఆఫర్లను చేజిక్కించుకున్నారు. వీరిలో 85 శాతం మంది సీఎస్ఈ విభాగానికి చెందిన వారు కావడం గమనార్హం.
ప్లేస్మెంట్స్లో అమెజాన్, గోల్డ్మన్ శాక్స్, ఫ్లిప్కార్ట్, పేటీఎం, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరకిల్, టాటా స్టీల్, అన్అకాడమి, సాంసంగ్, ఆర్ఐ, సిలికాన్ ల్యాబ్, అనలాగ్ డివైజెస్, డీఈ షా, జీఈ, రింగ్ సెంట్రల్, ఫ్యూచర్ ఫస్ట్ వంటి దిగ్గజ సంస్ధలు పాల్గొన్నాయి. ఐటీ, స్టార్టప్ కంపెనీలు ఎక్కువగా ప్లేస్మెంట్ డ్రైవ్లో పాల్గొనగా గత ఏడాది సగటున రూ 16 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేసిన కంపెనీలు ఈసారి రూ 24 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేశాయి.
గత ఏడాదితో పోలిస్తే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వేతన వృద్ధి, నియామకాల పరంగా ప్రోత్సాహకర వాతావరణం నెలకొందని ఐఐటీ భువనేశ్వర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్వీ రాజకుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం 80 శాతం మంది విద్యార్ధులు క్యాంపస్లోనే ఉంటూ ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్నారని చెప్పారు. మిగిలిన విద్యార్ధులు త్వరలోనే క్యాంపస్కు చేరకుంటారని అన్నారు. తమ క్యాంపస్లో విద్యార్ధులు ఏటా టాప్ ప్లేస్మెంట్స్ దక్కించుకుంటున్నారని, ఈ ట్రెండ్ ప్రతి ఏటా పెరుగుతూ పోతోందని ఐఐటీ భువనేశ్వర్ కెరీర్ డెవలప్మెంట్ సెల్ హెడ్ అరుణ్ ప్రధాన్ పేర్కొన్నారు.