కోల్కతా : కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం, మహమ్మారి నివారణ, చికిత్సలు అనుభవంలోకి రావడంతో ఆర్ధిక వ్యవస్ధ తిరిగి గాడినపడుతోంది. రెండేండ్లుగా అన్ని రంగాలు కుదేలైన పరిస్ధితి నుంచి ఎకానమీ మళ్లీ జవసత్వాలు పుంజుకుంటోంది. వివిధ రంగాల్లో నియామకాలు జోరందుకుంటున్నాయి.
ఐటీ సహా పలు రంగాలు ఉద్యోగుల నియామకాలకు మొగ్గుచూపడంతో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ఐఐఎం కలకత్తా 57వ బ్యాచ్ నూరు శాతం ప్లేస్మెంట్స్ను సాధించింది. రూ 34.2 లక్షల సగటు వార్షిక వేతనంతో ఐఐఎం కలకత్తా విద్యార్ధులందరికీ ప్లేస్మెంట్స్లో మెరుగైన ఉద్యోగాలు లభించాయని సంస్ధ ఓ ప్రకటనలో పేర్కొంది.
గత వారం వర్చువల్గా జరిగిన తుది ప్లేస్మెంట్ ప్రక్రియలో 190కి పైగా కంపెనీలు పాల్గొన్నాయని, ఇందులో 465 మంది విద్యార్ధులు పాల్గొనగా 631 ఆఫర్లు లభించాయని తెలిపింది. వివిధ రంగాల కంపెనీలు తమ అభ్యర్ధులను రికార్డు వేతనాలతో నియామకాలకు మొగ్గుచూపాయని ఐఐఎం కలకత్తా ఆ ప్రకటనలో తెలిపింది.