Crypto Currency | క్రిప్టో కరెన్సీని భవిష్యత్ కరెన్సీ అని ప్రచారం చేశారని, అయితే, హై-రిస్క్తో కూడుకున్నదైనా ప్రతి ఇన్వెస్టర్ దాన్ని కలిగి ఉండాల్సిందేనని భారత్ క్రిప్టో ఎక్స్చేంజ్ కాయిన్ స్విచ్ సీఈవో ఆశీష్ సింఘాల్ అన్నారు. తదుపరి తరం ఇంటర్నెట్ను సృష్టిస్తుందన్నారు. గురువారం టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్లో ఈటీ నౌ సీనియర్ ఎడిటర్ నయనతారా రాయ్తో చర్చాగోష్టిలో మాట్లాడారు. 15 ఏండ్ల క్రితం మీరు ఇంటర్నెట్ కంపెనీ ప్రారంభిస్తే, మరోచోట.. మీ గ్యారేజీలోనో, ఇంకెక్కడో వాటి సర్వర్లు పెట్టేవారని అన్నారు. ప్రస్తుతం కూర్చున్న దగ్గరే బ్లాక్చైన్ టెక్నాలజీ సాయంతో మన ఫోన్లు, లాప్టాప్లు అనుసంధానిస్తున్నామని అన్నారు.
గత రెండేండ్లుగా తమ క్రిప్టో ఎక్స్చేంజ్లో 1.8 కోట్ల మందికి పైగా సభ్యులయ్యారని ఆశీష్ సింఘాల్ అన్నారు. మన తల్లిదండ్రులు క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేయడం చూశాం. ఇప్పుడు వాటి కొనుగోళ్లను సరళతరం చేస్తున్నామన్నారు. తాము ఎక్స్చేంజ్ ప్రారంభించిన ఏడు రోజుల్లో తన తల్లి సభ్యురాలైందని, తన సొంతంగా తొలి బిట్ కాయిన్ కొనుగోలు చేసిందన్నారు.
2022 బడ్జెట్ను ఆశీష్ సింఘాల్ స్వాగతించారు. క్రిప్టో కరెన్సీ వాడకం, అసెట్గా పరిగణిస్తూ 2022 బడ్జెట్లో విభజించారన్నారు. క్రిప్టో రూల్స్ కోడ్లో రాస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని సమానంగానే పరిగణిస్తారని అన్నారు.