న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఆర్థిక ఫలితాల్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ నికర లాభం రెండింతలు పెరిగి రూ.343 కోట్లుగా నమోదైంది. ఆపరేటింగ్ ఆదాయం, మొండి బకాయిలను పూడ్చుకోవడానికి నిధుల కేటాయింపులు భారీగా తగ్గడం లాభాల్లో భారీ వృద్ధికి దోహదం చేశాయని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఏడాది క్రితం రూ.4,811.18 కోట్లుగావున్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.5,384.88 కోట్లకు ఎగబాకినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో వైద్యనాథన్ తెలిపారు. కంపెనీ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 4.01 శాతం నుంచి 2.63 శాతానికి దిగగా, నికర ఎన్పీఏ 1.90 శాతం నుంచి 1.15 శాతానికి తగ్గింది. కానీ, 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.20,394.72 కోట్ల ఆదాయంపై రూ.145 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.