IDBI Bank | ఐడీబీఐ బ్యాంక్ తన ఖాతాదారుల రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు 25 బేసిక్ పాయింట్లు పెంచేసింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. బుధవారం నుంచి వడ్డీరేట్ల పెంపు అమల్లోకి వస్తుంది. దేశీయ టర్మ్ డిపాజిట్లు, నాన్ రెసిడెంట్ ఆర్డీనరీ (ఎన్ఆర్వో), నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ) టర్మ్ డిపాజిట్లు)ల్లో అన్ని టెన్యూర్లకు పెరిగిన వడ్డీరేట్లు వర్తిస్తాయని ఐడీబీఐ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.
అంతర్జాతీయంగా ఫైనాన్సియల్ మార్కెట్లలో అనిశ్చితి, దేశీయంగా ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్ మార్కెట్లో ఫిక్స్డ్ డిపాజిట్ సురక్షిత పెట్టుబడి మార్గం అని ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ ఎండీ సురేశ్ ఖటంహర్ తెలిపారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 5.75 శాతం వడ్డీరేటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నమాన్ సీనియర్ సిటిజన్ ఎఫ్డీ బ్రాండ్ కింద రెసిడెంట్ సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అదనంగా 75 బేసిక్ పాయింట్ల వడ్డీ రేటు 6.50 శాతం వరకు అంద చేస్తున్నట్లు తెలిపారు.
ఆరు నెలల్లోపు రిటైల్ డిపాజిట్లపై 3.75 నుంచి నాలుగు శాతానికి, మూడేండ్ల నుంచి ఐదేండ్ల లోపు ఎఫ్డీలపై 5.50 నుంచి 5.60 శాతం, ఐదేండ్ల నుంచి పదేండ్ల వరకు గల డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఐదేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ అమలవుతుందని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది.
సీనియర్ సిటిజన్లు మదుపు చేసిన రిటైల్ డిపాజిట్ల (6 నెలల గడువు)పై 4.50 శాతం, ఐదేండ్ల లోపు 6.35 శాతం, పదేండ్ల లోపు డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఐదేండ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపైనా 6.50 శాతం వడ్డీరేటు అమలు చేస్తున్నట్లు వివరించింది.