ముంబై, అక్టోబర్ 29: ఐసీఐసీఐ బ్యాంక్ తమ ప్రత్యేక సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకంపై అందుబాటులో ఉన్న అదనపు వడ్డీరేటును మరింత పెంచింది. ఇంకో 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్లోని గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీలో నగదు దాచుకునే వృద్ధులకు ఇప్పుడు 0.20 శాతం అదనపు వడ్డీరేటు అందుతుంది. ఇంతకుముందు ఏడాదికి 0.10 శాతం మాత్రమే వచ్చేది. కాగా, ఐదేండ్ల ఒక రోజు నుంచి పదేండ్ల వరకు కాలపరిమితితో కూడిన రూ.2 కోట్లదాకా ఉండే ఎఫ్డీలకే ఈ ప్రత్యేక వడ్డీరేటు వర్తిస్తుంది.
నిజానికి ఈ ఎఫ్డీలపై 0.50 శాతం అదనపు వార్షిక వడ్డీరేటు వృద్ధులకు బ్యాంక్ ఇస్తున్నది. తాజా నిర్ణయంతో ఇది 0.70 శాతానికి చేరగా, మొత్తంగా గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం వార్షిక వడ్డీరేటు లభిస్తుంది. కొత్త వడ్డీరేట్లు శనివారం నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంక్ తమ వెబ్సైట్లో పేర్కొన్నది. ఇదిలావుంటే ఈ ప్రత్యేక ఎఫ్డీ స్కీంను వచ్చే ఏడాది ఏప్రిల్ 7దాకా ఐసీఐసీఐ బ్యాంక్ పొడిగించింది. వాస్తవానికి ఈ నెలాఖరుతోనే ముగియాల్సి ఉన్నది. గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీని మే 2020లో బ్యాంక్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి దీన్ని పొడిగిస్తూ వస్తున్నారు.