NSE Chitra Secrets | నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) కుంభకోణం కేసులో పన్ను రహిత స్వర్గధామాలుగా ఉన్న విదేశాలకు నిధులు మళ్లించారన్న కోణంపై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ దృష్టి సారించింది. ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ, ఆమె సలహాదారు ఆనంద్ సుబ్రమణ్యన్ విదేశాలకు అక్రమ మార్గాల్లో నిధులు మళ్లించారని అనుమానిస్తున్నారు. చిత్రా రామకృష్ణ, ఆనంద్ సుబ్రమణ్యం తరుచుగా వ్యక్తిగత, అధికారిక పనుల మీద సింగపూర్, మారిషస్, షీషెల్స్కు వెళ్లారని ఐటీ అధికారుల దర్యాప్తులో తేలింది. నిధుల మళ్లింపుపై ఆయా దేశాల దర్యాప్తు అధికారుల సమాచారం కోరనున్నట్లు ఐటీ అధికార వర్గాలు తెలిపాయి.
2016 డిసెంబర్లో ఎన్ఎస్ఈ సీఈవో అండ్ ఎండీగా చిత్రా రామకృష్ణ రాజీనామా చేయడానికి ముందు, తర్వాత పర్యటించిన దేశాల్లో నిధుల మళ్లింపుపై ఐటీ అధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నారు. ఒక ఎన్ఎస్ఈ బోర్డు సభ్యుడికి, ప్రైవేట్ వ్యక్తికి చిత్ర రామకృష్ణ, ఆనంద్ సుబ్రమణ్యన్కు సంబంధాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. చిత్రా రామకృష్ణ విదేశీ పర్యటనల తీరు ప్రణాళికాబద్ధంగానే ఉందని చెప్పారు.
చిత్రా రామకృష్ణ, ఆనంద్ సుబ్రమణ్యన్ తరుచుగా షీషెల్స్ను సందర్శించే వారు. కానీ, ఆమె ఎన్ఎస్ఈ సీఈవో అండ్ ఎండీగా రాజీనామా చేయకముందు, తర్వాత తమకు ఎటువంటి ఆధారాలు అందుబాటులో లేవంటున్నారు ఐటీ అధికారులు. షీషెల్స్ ప్రభుత్వ సాయం తీసుకోవాల్సి రావచ్చునంటున్నారు. రెండు ప్రత్యేక కేంద్రాల మీదుగా చిత్రారామకృష్ణ బృందం తన విదేశీ పర్యటనల దారి మళ్లించిందని ఐటీ అధికారి ఒకరు చెప్పారు.
గురువారం చిత్రా రామకృష్ణ, ఆమె తల్లి, ఆనంద్ సుబ్రమణ్యం.. ఆయన భార్యలను ఐటీ అధికారులు ప్రశ్నించారు. వారి ఇండ్లలో తనిఖీలు చేశారు. పలు ఎలక్ట్రానిక్ డివైజ్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ, ఎటువంటి ఆధారాల్లేకుండా జాగ్రత్తగా డిజిటల్ ఆధారాలు తొలగించేశారని ఐటీ అధికారులు చెప్పారు.